వెంకయ్యను దుమ్మెత్తిపోసిన హీరో శివాజీ: వచ్చే ఓట్లు అవేనని హేళన
ఏలూరు: ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న తెలుగు సినీ నటుడు శివాజీ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోశారు. వెంకయ్య నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వెంకయ్య ఎక్కడ పోటీ చేసినా 7, 8 వేల ఓట్లు రావని ఆయన హేళనగా మాట్లాడారు.
గెలిచే ఓట్లు రాకపోయినా వెంకయ్య నాయుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేంద్రాన్ని, బీజేపీని మోసం చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం గతంలో రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు అవసరం లేదంటున్నారని అంటూ ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలని, డబ్బు తమ దగ్గర కూడా ఉందని, ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని శివాజీ చెప్పారు. ప్రత్యేక హోదాపై బుధవారం జరిగిన రౌంట్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.
కాగా, ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి కూడా శివాజీ వెంకయ్య నాయుడిని లక్ష్యం చేసుకున్నారు. బిజెపిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో బిజెపి నుంచి ఆయనను బయటకు పంపించారు.