రివర్స్:గంగుల బాటలోనే శిల్పా సోదరులు, ఎస్ వి మోహన్ రెడ్డి రాజీ చర్చలు?
కర్నూల్ జిల్లాలో టిడిపికి చెందిన సీనియర్లు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కర్నూల్:కర్నూల్ జిల్లాలో టిడిపికి మరో షాక్ తగలనుంది. టిడిపి నాయకులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైసిఆర్ సిపి లో చేరారు. ప్రభాకర్ రెడ్డి బాటలోనే శిల్పా సోదరులు వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సిపి ని వీడి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. అయితే భూమా రాకతో కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఇమడలేకపోతున్నారు. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదరడం లేదు.
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అందరికీ సముచితమైన స్థానం ఉంటుందని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు.
భూమా నాగిరెడ్డి పార్టీలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అంతేకాదు శిల్పా వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులపై భూమా వర్గీయులు గతంలో దాడులకు పాల్పడ్డారు.
భూమా నాగిరెడ్డి రాకతో శిల్పా సోదరుల అసంతృప్తి
కర్నూల్ జిల్లాలో భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే పార్టీలో అందరికి సముచిత స్థానం ఇస్తానని బాబు హామీ ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భూమా నాగిరెడ్డి వర్గీయుల తీరుతో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో డిప్యూటీ సిఎం కె.ఇ. కృష్ణమూర్తి ఎదుటే తన ఆవేదనను శిల్పా మోహన్ రెడ్డి వెళ్ళగక్కారు. అయితే ఈ విషయాలన్నింటినీ కె.ఇ. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం.
వైఎస్ఆర్ సిపి లో వెళ్తారనే ప్రచారం
ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే టిడిపిని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరారు. 2014 ఎన్నికల ముందే ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. అయితే భూమా నాగిరెడ్డి పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. అయితే శిల్పా సోదరులు కూడ భూమా నాగిరెడ్డి పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు శిల్పా సోదరులు కూడ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సయోధ్య కోసం ప్రయత్నాలు
భూమా నాగిరెడ్డికి, శిల్పా మోహన్ రెడ్డి ,ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డిలకు మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించేందుకుగాను టిడిపి నాయకత్వం సయోధ్య ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు కర్నూల్ ఎంఏల్ఏ ఎస్ వి మోహన్ రెడ్డి టిడిపి నాయకత్వం రంగంలోకి దింపింది.అయితే ఈ విషయమై చర్చలు సాగుతున్నాయని సమాచారం.పార్టీని వీడకుండా శిల్పా సోదరులను ఒప్పించేందుకు నాయకత్వం చర్యలు తీసుకొంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.డోన్ ఎంఏల్ఏ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శిల్పా సోదరులతో చర్చిస్తున్నారని సమాచారం. వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు గాను బుగ్గన మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడ వైఎస్ఆర్ సి వైపు చూపు
ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడ వైఎస్ఆర్ సిపి వైపు చూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో గంగలు ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరడాన్ని ఇరిగెల రాంపుల్లారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల కుటుంబాలకు మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. అయితే గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడడంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడ వైఎస్ఆర్ సిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.అయితే గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరినందున రాంపుల్లారెడ్డి చేరుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.