మిస్టరీ వీడినట్లేనా-రెండో వివాహం: గౌతమిది ప్రమాదమే, శిరీష బెదిరించిన ఆధారాల్లేవు
పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీగౌతమిది ప్రమాదం వల్లే మృతి చెందిందని, ఎవరూ హత్య చేయలేదని ఎస్పీ భాస్కర భూషణ్ తెలిపారు.
పాలకొల్లు: పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీగౌతమిది ప్రమాదం వల్లే మృతి చెందిందని, ఎవరూ హత్య చేయలేదని ఎస్పీ భాస్కర భూషణ్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ నెల 18న పాలకొల్లు - నరసాపురం మార్గంలో కొత్తపేట గ్రామం వద్ద జరిగిన ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలై గౌతమి మృతి చెందినట్లు తెలిపారు. కేసును లోతుగా దర్యాప్తు చేశామని, హత్య జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. నరసాపురానికి చెందిన దంగేటి పావని, ఆమె సోదరి గౌతమి ఆసుపత్రిలో చూపించుకునే నిమిత్తం ఈనెల 18న బైక్ పైన పాలకొల్లు వచ్చారన్నారు. అనంతరం తిరిగి వెళ్తుండగా కొత్తపేట సమీపంలో వెనుక వస్తున్న టాటా సఫారీ కారు వీరిని ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో పావని, గౌతమిలు ఇద్దరికీ గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమి మృతి చెందారు. అనంతరం 22నవ తేదీన కోలుకున్న పావని ఇంటికి వచ్చాక గౌతమిది హత్యేనని కారుతో వెంబడించి ఢీకొట్టారని ఆరోపించారు.
రెండో వివాహం..
నరసాపురానికి చెందిన వీరవెంకట సత్యనారాయణ (బుజ్జి) తన అక్కను రెండో వివాహం చేసుకున్నాడని చెప్పిందని, అతడి మొదటి భార్య శిరీష తన కారు డ్రైవర్ రాంబాబు సహాయంతో గౌతమిని హత్య చేయించిందని ఫిర్యాదులో పేర్కొన్నాట్లు పోలీసులు చెప్పారు.
పావని ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తించాం
కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరిపామన్నారు. పావని ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తించామన్నారు.
నిజానికి ఈ నెల 18న విశాఖపట్నానికి చెందిన కారు యజమాని సందీప్, డ్రైవర్ ప్రసాద్, వారి స్నేహితుడు శ్రావణ్య కలిసి విశాఖ నుంచి కారులో విజయవాడ దుర్గ గుడికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో మద్యం తాగారు. పాలకొల్లులో బంధువుల ఇంటికి వెళ్లి, అనంతరం మొగల్తూరులో ఉన్న స్నేహితుడు టోనీ ఇంటికి వెళ్లారు.
అక్కడా మద్యం తాగిన తర్వాత విశాఖ బయలుదేరి పాలకొల్లు వచ్చారని, వీరి పరిస్థితి సరిగా లేనందున టోనీ వారికి ఫోను చేసి తిరిగి మొగల్తూరు వచ్చేయమని సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారు వెనక్కు వస్తూ కొత్తపేట వద్ద పావని, గౌతమిలు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొని ప్రమాదానికి కారణమయ్యారన్నారు. ఇది ప్రమాదమే అన్నారు.
ఆరోపణలు అవాస్తవం
పావనిని బుజ్జి భార్య శిరీష ఫోనులో బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని దర్యాఫ్తులో తేలిందని పోలీసులు చెప్పారు. బుజ్జి బంధువు రమేష్ కూడా ఫోను చేసి బెదిరించాడన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి, కారు డ్రైవరు రాంబాబు, రమేష్ తదితరుల కాల్డేటాలను పూర్తిగా పరిశీలించామని వారి మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదన్నారు.