ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్తో మెట్రోపై భేటీ
హైదరాబాద్: ఓటుకు నోటు గొడవ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన సమావేశానికి రాకుండా తన ఛేంబర్లోనే ఉండిపోయారు.
అయితే చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 2018 ఆగస్టు నాటికి విజయవాడ మెట్రో రైలు తొలొదశ పూర్తి అయ్యేలా చూడాలని చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ మెట్రో నిర్మాణానికి నిధుల కొరతలేదన్నారు. జైకా తోడ్పాటు ఉంటుందని మెట్రో సలహాదారు శ్రధరన్కు ఆయన వివరించారు.
మెట్రోల నిర్మాణ ప్రగతిని ప్రతినెల సమీక్షించేలా ప్రాసెస్ చార్ట్ను రూపొందించాలని శ్రీధరన్ను చంద్రబాబు కోరారు. 2018 డిసెంబర్ కల్లా విశాఖ మెట్రో తొలిదశ పూర్తికావాలని సూచించారు. ఈ సమావేశంలో మెట్రో సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్సీ అధికారులు పాల్గొన్నారు.
కాగా, శాసనసభలో నోటుకు ఓటు వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.