చంద్రబాబు జాలీ ట్రిప్పులు: శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటనలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కష్టాలను మరిచిపోయి విదేశాల్లో జాలీ ట్రిప్పులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కన్నా నీరో చక్రవర్తి నయమనిపించే విధంగా పరిస్థితి ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు చేసి చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ఆయన అడిగారు. విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చుకు సమానంగానైనా పెట్టుబడులు వచ్చాయా అని ఆయన అడిగారు. చంద్రబాబుకు ప్రచారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర నిఘా సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు విదేశాలకు తాకట్టు పెడుతారనే భయం ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అననారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చంద్రబాబు మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన ఐదు సంతకాల మాటేమైందని అడిగారు. విదేశీ పర్యటనలపై పెడుతున్న శ్రద్ధలో చంద్రబాబు పదో వంతు రాష్ట్రాభివృద్ధిపై పెడితే మంచిదని ఆయన అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో ఒరిగిందేమీ లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.