సింహాద్రిలో తొక్కిసలాట: స్పృహ తప్పిన మహిళ
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఈ క్రమంలో ఉచిత క్యూలైన్లలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అధికారులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీగా పొటెత్తిన భక్తులను ఆలయ సిబ్బంది అదుపు చేయలేకపోతున్నారు. భక్తులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉంది.
భక్తుల కాళ్లు కాలకుండా కొండ మీదికి కార్పెట్లు పరిచారు. సాధ్యమైనంత త్వరగా దర్శనాలు ముగిస్తామని ఆలయ అధికారులు అంటున్నారు.
కాగా, సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకొని స్వామివారు భక్తులకు నిజరూప దర్శనమిస్తారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త ఆనందగజపతి రాజు స్వామివారికి పట్టువస్త్తాలు సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. ఈయనతో పాటుగా మంత్రి గంటా శ్రీనివాస రావు, డాలర్ శేషాద్రి, కనుమూరి బాపిరాజు స్వామివారిని దర్శించుకున్నారు. పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆనంద గజపతిరాజు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్లువస్ర్తాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. టీటీడీ తరఫున ఈవో సాంబశివరాలు శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.