తప్పిన పెను ప్రమాదం: అర్ధరాత్రి విశాఖ చేరిన అండమాన్ నౌక
విశాఖపట్నం: నగర తీరం నుంచి మంగళవారం బయల్దేరిన అండమాన్ నౌక్ 'హర్షవర్ధన్' నడి సముద్రంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ నౌక సురక్షితంగా మళ్లీ విశాఖ తీరానికి చేరుకుంది. దీంతో నౌకలోని మొత్తం 600మంది ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులలో ఏపీ వారే ఎక్కువగా ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగా నడి సముద్రంలో నిలిచిన అండమాన్ హర్షవర్ధన నౌకను మంగళవారం అర్ధరాత్రి విశాఖ తీరానికి తీసుకొచ్చారు. సముద్రంలోనే లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో వెనక్కి తీసుకురావడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆ నౌక విశాఖ తీరంలోనే ఉంది. దీంతో ప్రయాణికులు కూడా పోర్టులోనే పడిగాపులు గాస్తున్నారు. బుధవారం ఉదయం ప్రయాణికులకు అధికారులు అల్పాహారాన్ని అందించారు. అయితే, తమ ప్రయాణం ఎప్పుడో చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
నడి సంద్రంలో ఆగిపోయిన అండమాన్ నౌక: ఏపీ ప్రయాణికుల ఆందోళన
పోర్టులోనే హర్షవర్ధన నౌకను బాగు చేసిన అనంతరం అండమాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టుకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక నిపుణులు నౌకను బాగు చేసే పనిలో ఉన్నారని చెప్పారు.