బాలుడిపై పిచ్చి కుక్క దాడి, బాలికను రాళ్లతో కొట్టి చంపిన దుండగుడు
హైదరాబాద్: పిచ్చికుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలోని మోగులూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మార్కపూడి భానుప్రసాద్ (6) ఇంటికి సమీపంలోని పచారి కొట్టు దగ్గరకు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ఉన్న పిచ్చి కుక్క దాడి చేసింది.
ఈ సంఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలపై భాగంతో పాటు వీపు వెనుక భాగంలో కుక్కలు పీక్కుతున్నాయి. వెంటనే బాలుడ్ని కంచకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందించారు.
అనంతరం బాలుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణాపాయానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.
ఇటీవలే గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో షేక్ కౌషర (6) అనే బాలిక మీద పది కుక్కలు ఒకేసారి దాడి చేసి దారుణంగా చంపిన విషయం తెలిసిందే.
బాలికను రాళ్లతో కొట్టి చంపిన దుండగుడు
నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కావలి శివారులోని చెన్నకేశవనగర్లో నాలుగేళ్ల తిరుపతమ్మ అనే బాలికను ఓ దుండుగుడు రాళ్లతో కొట్టి చంపేశాడు. ముళ్ల పొదల్లో చిన్నారి మృతదేహాన్ని పడేశారు. పొలం పనులు ముగించుకుని ఆ రహదారి వెంట వచ్చిన రైతులు బాలిక మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారి తల్లిదండ్రులు నీలమ్మ, సత్తయ్య కన్నీరు మున్నీరయ్యారు. అయితే కుటుంబ కక్షల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయలు లేకపోవడంతో, చిన్నారిపై అత్యాచారం జరిగి ఉంటుందేమో అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
విహారయాత్రలో విషాదం
విహారయాత్రలో భాగంగా వాటర్ ఫాల్స్ చూడాలన్న కోరికతో వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సీఎన్పురం మండలం భైరవకోన దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
భైరవకోన అందాలు తిలకించేందుకు ఒక బృందం వచ్చింది. బృందంలోని ఓ యువకుడు వాటర్ఫాల్స్ చూడాలనే కోరికతో కొండపైకి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న బావిలో పడి మృతిచెందాడు. యువకుడి మృతితో విహార యాత్ర కాస్త విషాదంగా మారిందన్నారు.