'అమరుల శవాలపై టీఆర్ఎస్ పార్టీ పండుగ': బస్సు ధ్వంసం
హైదరాబాద్: ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువరించనందుకు నిరసనంగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి సభను అడ్డుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నించారు. అమరవీరుల త్యాగ ఫలితాల వల్ల ఏర్పడిన తెలంగాణలో తెరాస ప్రభుత్వం కృతజ్ఞతను మరిచి విద్యార్థుల శవాల పైన పార్టీ పండుగ చేసుకుంటోందని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆరోపించింది.
పలువురు నాయకుల నేతృత్వంలో వేర్వేరుగా గ్రంథాలయం, ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. వారిలో కొందరిని తార్నాక వద్ద, మరికొందరిని ఉస్మానియా పోలీసు స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేసి ఉస్మానియా పోలీసు స్టేషన్కు తరలించారు.
తార్నాక వద్ద కొందరు విద్యార్థులు తెరాస సభకు వెళ్తున్న బస్సుల పైన రాళ్లు రువ్వుతున్నారు. ఈ ఘటనలో బస్సు ధ్వంసమైంది. దీనిపై నిరుద్యోగ సంఘాల నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, లక్ష ఉద్యోగాల ప్రకటన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్లీనరీ తీర్మానాల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించి ప్రకటన చేయలేదన్నారు.
త్వరలో రాహుల్ పాదయాత్ర: వీ హనుమంత రావు
తెలంగాణలో 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, రైతులు తీవ్ర సంక్షోభానికి గురి కావడం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిచి వేసిందని, త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే కిసాన్ పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు సోమవారం తెలిపారు.
తెలంగాణలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని.. అక్కడి నుంచే పాదయాత్ర చేపట్టాలని చేసిన తన విజ్ఞప్తికి రాహుల్ అంగీకరించారన్నారు. గతంలోనూ ఈ విషయంపై రాహుల్కు లేఖ రాశానని, ఇప్పుడు స్వయంగా కలిసి కోరానని వీహెచ్ చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ స్వంత జిల్లా మెదక్ నుంచే రాహుల్ తన పాదయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కాగా, రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్య చేసుకున్న విదర్భ(మహారాష్ట్ర) నుంచి పాదయాత్ర ప్రారంభించాలని ఆ రాష్ట్ర నేతలు కూడా రాహుల్ను కోరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బుందేల్ ఖండ్, పంజాబ్లలో రైతులు ఇబ్బందులకు గురవుతున్న జిల్లాల్లోనే ఆయన పర్యటించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి.