మోస్ట్ వరస్ట్, ఏం చేశారు?: ఎన్టీఆర్, చిరంజీవిలపై సుబ్రమణ్యస్వామి సంచలనం
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్పై సంచలన ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రాజకీయ, సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్పై సంచలన ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రాజకీయ, సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు తప్ప, రాజకీయాల్లో చాలామంది సినీనటులు విఫలమయ్యారని అన్నారు.
దిగ్గజ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు, మాజీ కేంద్రమంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు స్వామి. తమిళనాడులో కామరాజు మినహా మరెవరూ రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రజల మన్నలను పొందలేదని అభిప్రాయపడ్డారు.
చదువేరాదంటూ రజినీపై..
రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని సుబ్రమణ్యస్వామి ఓ జోక్గా కొట్టిపారేశారు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. రజనీకాంత్కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారని, తరుచుగా నిర్ణయాలు మార్చుకుంటారని ఆయన అన్నారు. రజనీకాంత్ విషయంలో తమిళ స్థానిక మనోభావాలను సుబ్రహ్మణ్యస్వామి వెలికి తీశారు. రజనీకాంత్ అసలు తమిళుడే కారని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ అని ఆయన వ్యాఖ్యానించారు. రజనీకాంత్ అభిమానులున్న మాట వాస్తవమేనని, అయితే వారు రజనీకాంత్ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవారు కారని, ఓ గంపులా రజనీకాంత్ను ఆరాధిస్తున్నారని ఆయన అన్నారు. రజినీకి చదువు కూడా రాదని, తమిళ రాజకీయాలకు ఆయన పనికి రాడని తేల్చి చెప్పారు. అతనికి భారతరాజ్యాంగం కూడా తెలియదని అన్నారు.
కామరాజు బెస్ట్.. జయ, ఎంజీఆర్ ఫెయిల్
కామరాజు తమిళ రాజకీయాల్లో అద్భుతంగా రాణించారని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అలాగే రాజగోపాల చారి కూడా గొప్ నేత అని చెప్పుకొచ్చారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్, దివంగత ముఖ్యమంత్రి జయలలితలు తమిళ రాజకీయాల్లో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
శతృఘ్న సిన్హా
శతృఘ్న సిన్హా భారత ప్రజలందరికీ తెలుసని సుబ్రమణ్యస్వామి తెలిపారు. సినిమాల్లో రాణించినట్లుగానే ఆయన రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలా మందిలో కొద్దిమంది మాత్రమే రాణిస్తున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ మోస్ట్ వరస్ట్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీ పెట్టిన అత్యంత తక్కువ సమయంలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నందమూరి తారక రామారావు కూడా రాజకీయాల్లో పూర్తిగా విఫలమయ్యారని సుబ్రమణ్యస్వామి అన్నారు. సినీ పరిశ్రమలోనుంచి వచ్చిన అందరిలోకెల్లా ఎన్టీఆరే చాలా ఘోరంగా విఫలమయ్యారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి ఏం చేశారో కూడా తెలియదు..
యూపీఏ ప్రభుత్వం(2009-14)లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లో అత్యంత ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. అంతేగాక, చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలైతే చేపట్టారు గానీ.. ఆయన ఏం చేశారో తనతోపాటు ఎవరికీ తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుబ్రమణ్యస్వామి. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణ్యస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై అదేస్థాయిలో ఎదురుదాడి జరిగే అవకాశం లేకపోలేదు.