ట్విస్ట్.. నంద్యాలపై సుజన ఫోకస్: శిల్పా ధీమా, అఖిలప్రియ యూటర్న్?
నంద్యాల ఉప ఎన్నికల అంశం టిడిపిలో హీట్ పెంచుతోంది. ఓ వైపు అఖిల ప్రియ కుటుంబం, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి టిక్కెట్ కోసం పట్టుబడుతుండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ విధంగా ఇరుకున పడ్డారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల అంశం టిడిపిలో హీట్ పెంచుతోంది. ఓ వైపు అఖిల ప్రియ కుటుంబం, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి టిక్కెట్ కోసం పట్టుబడుతుండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ విధంగా ఇరుకున పడ్డారు.
నంద్యాల టిక్కెట్ ఎవరికో చెప్పిన శిల్పా: అఖిల తేల్చేసింది.. మెత్తబడ్డారా
ఈ నేపథ్యంలో ఆయన నంద్యాల పైన దృష్టి సారించారు. త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండడంతో అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కర్నూలు జిల్లాలోని 2 నియోజకవర్గాలకు ఇంచార్జి మంత్రులుగా నియమితులైన సుజనా, కాల్వ శ్రీనివాసులను ఆదేశించారు.
నంద్యాలపై బాబు ఫోకస్
సంస్థాగత ఎన్నికలపై సోమవారం రాత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై నిర్లక్ష్యం వహించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా వైసిపి నేతలతో కలిసి పర్యటించిన చదలవాడ కృష్ణమూర్తిపై సమీక్షలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆయన నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు.
అయితే, చంద్రబాబు ప్రధానంగా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి సారించారు. టిక్కెట్ అఖిలప్రియ కుటుంబానికి వస్తుందా లేక శిల్పా మోహన్ రెడ్డి దక్కించుకుంటారా అనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది.
చంద్రబాబు బిజీగా ఉండటం వల్లే..
ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాతే ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన ఉంటుందని మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. విలేకరులు నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి ఎవరని అడగగా.. దీనిపై ఆమె స్పందిస్తూ రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రితో తమ సమావేశం ఉండేదని, అయితే ఆయన తీరికలేకుండా ఉండడంతో అనుమతి లభించలేదన్నారు. అభ్యర్థి ఎంపికపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.
అఖిల వెంట కుటుంబం
ఏది ఏమైనా ముఖ్యమంత్రితో మాట్లాడకుండా తమ నిర్ణయం చెప్పడం భావ్యం కాదని అఖిలప్రియ అన్నారు. ఆ సమయంలో అఖిల వెంట కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎవరికిచ్చినా ఓకే అన్న చక్రపాణి రెడ్డి
మరోవైపు, అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.
ఆ వ్యాఖ్యల వెనుక విశ్వాసమా?
టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తాము సహకరిస్తామని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. అంటే కొద్ది రోజుల క్రితం అధినేతతో శిల్పా సోదరుల భేటీలోనే టిక్కెట్ ఎవరికి అనేది తేలిపోయిందా అనే చర్చ సాగుతోంది. శిల్పా మోహన్ రెడ్డి చెప్పిన మాటలతో చంద్రబాబు కన్విన్స్ అయ్యారనే వాదనలు ఉన్నాయి.
అఖిల ప్రియ యూటర్న్
మరోవైపు, అఖిల ప్రియ ఈ నెల 24వ తేదీన(నిన్న-సోమవారం) తమ కుటుంబం నుంచి నంద్యాల కోసం అభ్యర్థిని ప్రకటిస్తామని కొద్ది రోజుల క్రితం చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు కలిశాక ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అఖిలప్రియను బుజ్జగించే ప్రక్రియ నడుస్తోందా లేక ఆమె ఆల్ రెడీ మెత్తబడ్డారా తెలియాల్సి ఉంది.