అందుకే: ప్రత్యేక హోదాపై ఒప్పుకున్న సుజనా, 'బాబు విహారయాత్రలా...'
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : తాము బిజెపికి మిత్ర పక్షం కావడం వల్లనే ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేయలేకపోయామని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకోవడం వల్లే ప్రత్యేక హోదా విభజన హామీలపై ప్రస్తావించలేకపోయామని ఆయన బుధవారంనాడు అన్నారు.
తమ తెలుగుదేశం పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, వాటి ప్రకారమే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారానే హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. జగన్ తన కేసులను మాఫీ చేసుకోవడం గురించి మాత్రమే దీక్ష చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తానన్న మురళీమోహన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా అది అతని వ్యక్తిగత అభిప్రాయమని కొట్టిపారేశారు.
రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విహారయాత్రలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారథి విమర్శించారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
రాష్ట్రం అప్పుల్లో కూరకుపోయిందని చెబుతూ తాను మాత్రం సింగపూర్, మలేషియాలు తిరుగుతూ బోలెడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని పేరుతో నాటకాలాడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దిగువకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు త్వరలో జగన్ లేఖ రాస్తారని పార్థసారథి చెప్పారు.
రైతులు సమస్యలతో సతమతమవుతుంటే చంద్రబాబు విదేశాలకు వెళ్లడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడిందని పార్థసారథి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎపి అంతా బీడుభూమిగా మారిపోయిందని అన్నారు. ఎపిలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.