సీఎం చెప్పినా.. ఎందుకలా?: అఖిలకు సుజనా ఫోన్.. ఏకపక్షం వద్దని హెచ్చరిక!
అలాగే భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టడంపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కర్నూలు: సొంతగూటి నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేవిగా మారడంతో.. డ్యామేజీ కవర్ చేసి పనిలో పడ్డారు టీడీపీ నేతలు. నంద్యాల రాజకీయంపై టీడీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చిన కొద్దిరోజులకే లుకలుకలు బయటపడటం పార్టీని కలవరపెడుతోంది.
శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవడంతో.. పార్టీని తిరిగి పెట్టేందుకు పలువురు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి అఖిలప్రియతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా.. కేంద్రమంత్రి సుజనా చౌదరి, మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమెతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
పార్టీలో అందరిని కలుపుకుని వెళ్తేనే మంచిదని, ఏకపక్షంగా వ్యవహరించవద్దని వీరిద్దరు అఖిలప్రియకు సూచించినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం కల్పించుకున్నప్పటికీ.. నంద్యాల ఉపఎన్నిక టికెట్ పై పదేపదే అఖిలప్రియ కామెంట్ చేయడాన్ని వారు తప్పుపట్టినట్లు చెబుతున్నారు. టికెట్ విషయంలో అఖిలప్రియ అసలు మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అసహనం వ్యక్తం చేశారట.
అలాగే భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టడంపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా అందరిని కలుపుకుని వెళ్తేనే పార్టీకి మేలు జరుగుతుందని చెప్పారట.
కాగా, శిల్పాతో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పార్టీ మారడటంతో టీడీపీ అధిష్టానం అఖిలప్రియపై గుర్రుగా ఉంది. మోహన్ రెడ్డిని అఖిలప్రియ కలుపుకుపోయి ఉంటే ఇదంతా జరగకపోయేదని వారు భావిస్తున్నారు. ఉపఎన్నికకు ముందు పార్టీలో ఇలాంటి పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళనలో ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఉంది.
మంత్రి పీఏపై ఆరోపణలు:
అఖిలప్రియ తీరుపైనే గుర్రుగా ఉన్న టీడీపీ అధిష్టానానికి ఆమె పీఏ వ్యవహారం కూడా తలనొప్పిగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలైన నీరు-చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో మంత్రి పీఏ లంచాలకు తెరలేపాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం సీఎం చంద్రబాబు వద్దకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు.