రాజ్యసభ ట్విస్ట్: ఏపీ నుంచి సురేష్ ప్రభు, 'రైల్వే జోన్' వ్యూహమా?
హైదరాబాద్: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ అభ్యర్థి విషయంలో కొత్త ట్విస్ట్! అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేరు, నిన్నటి దాకా మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరు వినిపించింది. అయితే, బీజేపీ వ్యూహాత్మకంగా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేరును తెరపైకి తీసుకు వచ్చింది.
వెంకయ్య రాజస్థాన్ నుంచి, నిర్మలా సీతారామన్ కర్నాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. టిడిపి కోటాలో దక్కనున్న మూడు స్థానాల్లో బీజేపీకి ఒక సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు. ఆ పేరుపై ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది.
ఈ నేపథ్యంలో ప్రధానంగా నిర్మలా సీతారామన్ పేరు వినిపించింది. అయితే, అనూహ్యంగా సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని బీజేపీ నిర్ణయించింది. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా టిడిపి మద్దతుతో బీజేపీ ఓ స్థానానికి తన అభ్యర్థిని బరిలోకి దించనుంది.
ఇతర రాష్ట్రాల నుంచి పోటీచేసే రాజ్యసభ అభ్యర్థుల్ని బీజేపీ నాయకత్వం అదివారం ప్రకటించింది. ఏపీ నుంచి అభ్యర్థి ఎవరన్నది మాత్రం అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. సురేష్ ప్రభు మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
రెండేళ్ల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మల సీతారామన్ టిడిపి మద్దతుతో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఆమె రెండేళ్ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనుండటంతో ఈసారి ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారన్న విషయం కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీ నుంచి ఈసారి రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభును బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. నిర్మలా సీతారామన్ను కర్ణాటక నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. మిత్రపక్షం టిడిపి అధినేత చంద్రబాబుతో అదివారం సంప్రదింపులు జరిపిన బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీ నుంచి సురేష్ ప్రభును రాజ్యసభకు పంపాలని కోరినట్లు తెలిసింది.
ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటన అంశం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రైల్వేమంత్రిని ఏపీ నుంచి బరిలోకి దించాలని అనుకోవడం వ్యూహాత్మకమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంటే, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే అవకాశముందని, తద్వారా సురేష్ ప్రభును చూపించి ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి ఉంటుందని భావిస్తున్నారు.