మోడీతో మాట్లాడ్తా, బాబు సానుకూలం కావచ్చు: కెసిఆర్
ఖమ్మం : తెలంగాణ 2017 సంవత్సరం నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. మణుగూరులో భద్రాద్రి పవర్ప్లాంట్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ తయారు అవుతుందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 1,080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని చెప్పారు.
మూడేళ్లలో భద్రాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 24 వేల మెగావాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఉద్ఘాటించారు. భద్రాచలం జగత్ విఖ్యాతం అవుతుందన్నారు. సప్తతులతో మాట్లాడి భద్రాచలాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.
తనకు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని మీద విశ్వాసం ఎక్కువ ఆని చెప్పుకుంటూ రాష్ట్రంలోని శివాలయాలను, కాళేశ్వరం, అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాచలంలోని కొన్ని గ్రామాల విలీనంపై ప్రధాని మోడీతో మాట్లాడుతానని తెలిపారు. అవసరం లేకున్నా ఎటపాక, పురుషోత్తమపురం ప్రాంతాలను ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. ఆయా గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నానని చెప్పారు.
భద్రాచలాన్ని మించిన దేవాలయం తెలంగాణలోనే లేదు అని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. పక్కనే ఇంత పెద్ద గోదావరి ఉన్నా ఖమ్మం జిల్లాలో కరువు ఉండడం దురదృష్టకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పారు. ఐదారు రోజుల్లో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తా. మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. భద్రాచలం నుంచే పర్యటన ప్రారంభిస్తానని చెప్పారు.