ఆపకుంటే నీ గుట్టు విప్పుతా: జగన్కు ఎస్వీ, ఆదికి రివర్స్.. వైసిపిలోకి సొంతవాళ్లు
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మా పైన జగన్ మాటల దాడి ఆపకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆయన హెచ్చరించారు.
డబ్బులు తీసుకొని పార్టీ మారే చరిత్ర తమది కాదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారితే తప్పేమిటని ప్రశ్నించారు. మా పైన నోరు జారితే జగన్ గుట్టు విప్పుతామని చెప్పారు. జగన్ పట్ల ఎమ్మెల్యేలు నమ్మకం కోల్పోయారని చెప్పారు.
తమది సంపన్న కుటుంబమేనని చెప్పారు. డబ్బుకోసం కక్కుర్తి పడే అవసరం తనకు లేదన్నారు. జగన్ నాయకత్వంలో వైసిపి బలపడుతుందన్న నమ్మకం లేకే ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని చెప్పారు.
చంద్రబాబు విజన్ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. తమ పైన జగన్, వైసిపి నేతలు మాటల దాడి చేస్తే తాము ఎదురు దాడికి సిద్ధమని చెప్పారు. తమ పైన చేస్తున్న అవినీతి ఆరోపణలు సరికాదన్నారు.
ఆదినారాయణకు ఝలక్, వైసిపిలోకి 100 మంది
కొద్ది రోజుల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సొంత వర్గంలోని వారు షాకిచ్చారు. ఆయన వర్గంలో ఉన్న 100కు పైగా కుటుంబాలు వైసిపిలో చేరాయి. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా వైసిపిలో చేరారు.
జమ్మలమడుగు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్య కూడా వైసిపిలో చేరారు. తాము జగన్కు, అవినాష్ రెడ్డికి అండగా ఉంటామని వారు ప్రకటించారు. ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం లేని చంద్రబాబు పాలనతో వీరంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారని, ఎన్ని పథకాలు ఉన్నా వీరి దరికి చేరలేదన్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నా, ప్రజల అభిమానం చెక్కు చెదరలేదన్నారు.