వణికిస్తున్న స్వైన్ఫ్లూ: ఒక్కరోజే ఏపి, తెలంగాణలో ఆరుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను స్వైన్ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకి ఈ వ్యాధి భారిన పడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. శనివారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు మృతి చెందారు. కాగా, ఈ జనవరి నెలలో మొత్తం 1,475 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి.
వీరిలో 523 మందికి స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 80 మంది స్వైన్ఫ్లూ బాధితులకు ప్రత్యేక చికిత్స ఇస్తున్నారు. స్వైన్ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు. ఓ వైపు ఆస్పత్రులకు రోగుల తాకిడీ పెరుగుతుండటం.. మరోవైపు ఆస్పత్రుల్లో వసతుల లేమి ఉండటంతో చికిత్సకు తీవ్రంగా ఆటంకంగా పరిణమించింది.
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకూ 63 స్వైన్ఫ్లూ కేసులు నమోదవగా.. వారిలో 35 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణయ్యింది. మరో 29 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తేలింది. స్వైన్ఫ్లూ చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం స్వైన్ ఫ్లూ బారిన పడి ముగ్గురు మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 64 మందికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయగా 32 మందికి నిర్ధారణ అయిందని పేర్కొంది.