టిఆర్ఎస్ను చీల్చేందుకు హరీష్ రెడీ, ఈటెల సాక్ష్యం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు మాజీ ఎంపి, సినీ నటి విజయశాంతికి పట్టిన గతే పడుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ సెక్రటరీల నిమాయకం చెల్లదని అంటూ ఈమేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను మంగళవారం కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
న్యాయస్థానం తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. రాజీనామా ఆమోదించుకోని తలసాని శ్రీనివాస్కి తమని విమర్శించే అర్హత లేదని రేవంత్ రేవంత్ రెడ్డి అన్నారు.
టిఆర్ఎస్ పార్టీలో జేబు దొంగలు, చిల్లర దొంగలు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడడం సమయం వృధా అని ఆయన అన్నారు. గతంలోనే టిఆర్ఎస్ను చీల్చి కాంగ్రెసులో విలీనం చేసేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. దానికి ఈటెల రాజేందర్ సాక్ష్యమని ఆయన చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు హరీష్ రావు సిద్ధమైతే టిడిపి మద్దతు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
తమ పార్టీ శిక్షణా తరగతులను ప్రతిపక్షాలు విమర్శించడం తగదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే శిక్షణా తరగతులను నిర్వహించుకున్నామని తెలిపారు. హష్కీ సంస్థకు డబ్బులు చెల్లించి శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు.
హాష్కీ సంస్థకు డబ్బులు చెల్లించి ఎవరైనా శిక్షణ తీసుకోవచ్చునని తెలిపారు. శిక్షణా తరగతుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదన్నారు. విమర్శించిన నేతలే గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు.
సంకుచిత మనస్తత్వం గల వారే శిక్షణా తరగతులను విమర్శిస్తున్నారని తెలిపారు. విమర్శించే వాళ్లు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదని, తెలంగాణ అభివృద్ధిలో కూడా కలిసి రావడం లేదని అన్నారు. విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందని తెలిసినా కూడా రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.