చంద్రబాబువి ప్రగల్భాలే, అభ్యర్థులే దొరకడం లేదు: తలసాని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పవన్నే ప్రగల్భాలేనని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు అభ్యర్థులే దొరకడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అతి గతి లేదని అన్నారు. ఏపికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగినా.. చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన వల్లే నిరుద్యోగ సమస్య వచ్చిందని అన్నారు.
హైకోర్టు విభజన కోరుతూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గచ్చిబౌలిలో హైకోర్టు కోసం స్థలాన్ని కూడా కేటాయించామని తెలిపారు. తమ పార్టీ ఎంపీలు హైకోర్టు విభజన కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిశారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని, అందుకు అందరి సహకారం కావాలని అన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చెత్త నాయకులంతా తయారై ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.