29న తెరాసలోకి తలసాని, తీగల! కేసీఆర్ 'పవర్' ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలు ఈ నెల 29వ తేదీన అధికారిక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్, తెరాస భావిస్తోంది. ఇందులో భాగంగా పలువురు తెలంగాణ టీడీపీ నేతలను ఆకర్షించిన విషయం తెలిసిందే.
ఈ నెల 29వ తేదీన నిజాం కాలేజీ మైదానంలో తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డిలు హాజరు కానున్నారు. అదే సమావేశంలో వీరు తెరాసలో చేరనున్నారని తెలుస్తోంది.
తీగల, ధర్మారెడ్డిలు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారి చేరిక పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ 'పవర్' ప్లాన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్యుత్ సమస్య నుండి బయటపడేందుకు ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ పంపు సెట్లక్ సోలార్ పవర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.కోటిన్నర విధులు విడుదల చేయాలని నిర్ణయించారు. మరో ఐదో నెలల తర్వాత మరో కోటిన్నర రూపాయలు విడుదల చేయనున్నారు.
అధికారులను మార్చాలని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ను కోరారని తెలిస్తోంది. దానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ అధికారి కావాలో చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు లేని చోట ఇంఛార్జీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
శుక్రవారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. వారు గవర్నర్తో భేటీ వివరాలను బాబుకు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారని తెలుస్తోంది.
విద్యుత్ సమస్యపై కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. సమస్యలకు బాధ్యులెవరన్న అంశంపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు.
ఆరోపణలు గుప్పించి తీరా చర్చకొచ్చేసరికి తప్పించుకునేందుకు యత్నించే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. జఠిల సమస్యగా మారిన విద్యుత్ కోతలను నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామన్నారు.