'అలిపిరి తర్వాత మారానని దెబ్బయిపోయావ్, ఆ హత్యపై సీబీఐ వేయగలరా?'
హైదరాబాద్: నంద్యాల ఉపఎన్నిక కోసం వైసీపీ నేతలంతా టీడీపీపై మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. అధినేత జగన్, ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పటికే పదునైన విమర్శలతో విరుచుకుపడుతుండగా.. మిగతా నేతలంతా అదే దారిలో పయనిస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, హత్యా రాజకీయాలకు కేరాఫ్ అయిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని నంద్యాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జీవో అంటే గో అని:
జగన్ నీడను చూసి భయపడుతున్న చంద్రబాబు, మంత్రులు.. ఆయనకు లభిస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల హడావుడి కోసమే చంద్రబాబు జీవోలను విడుదల చేశారని, వాటిని నమ్మవద్దని తమ్మినేని సూచించారు. ఆయన జీవో అంటే గో అని అర్థమని, జీవో అవసరం తీరాక గో అంటారని ఎద్దేవా చేశారు.
మంత్రులకేం పని?
మంత్రులంతా నంద్యాలలోనే పాగా వేశారని, వారికి అక్కడేం పని అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనను వదిలేసి నంద్యాలలో ఏం చేస్తున్నారని, మూడేళ్లలో అభివృద్ధికి లేని డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. అభివృద్ధి గెలిపిస్తుందనుకుంటే.. 2019నాటికి ఈ ఎన్నికను సీఎం రిఫరెండంగా స్వీకరిస్తారా? అని తమ్మినేని సవాల్ విసిరారు.
దానిపై సీబీఐ వేస్తారా?
ఇక పరిటాల రవి హత్యను ప్రస్తావిస్తూ.. అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణలకు కొడుకు మీదే సీబీఐ విచారణ వేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీబీఐ విచారణలో జగన్ పాత్ర లేదని తేలిందన్నారు. వంగవీటి రంగ హత్య కేసులో చంద్రబాబు పాత్రపై అప్పటి కేబినెట్ లో మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. దానిపై సీబీఐ విచారణ చేపట్టగలరా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు.
అలిపిరి తర్వాత భంగపాటు:
అలిపిరి ఘటన తర్వాత నేను మారిపోయాను అని చెప్పిన చంద్రబాబు.. దేశంలోనే అవినీతి చక్రవర్తి నం.1గా మారారని విమర్శించారు. అలిపిరి దాడి తర్వాత సానుభూతి పనిచేస్తుందనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. డ్వాక్రా రుణాలు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామిలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిల్లో ఒక్కటి నెరవేర్చలేదని చెప్పారు.
దేశం మొత్తం మీద 7.0శాతం వృద్ది అని కేంద్రం చెబుతుంటే.. ఏపీలో మాత్రం 24శాతం వృద్ది రేటు ఉందని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అన్నారు.