కేశినేని నాని కంటే గేమ్ బాగా ఆడగలం: బాబు ఆఫీస్ అధికారి, అధిష్టానం సీరియస్
విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని ఇటీవల ట్రాన్సుపోర్టు అధికారుల పైన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది.
విజయవాడ: విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని ఇటీవల ట్రాన్సుపోర్టు అధికారుల పైన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయన దూకుడు సరికాదని పార్టీలోనే కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
కేశినేని నాని, ఆయన టీం తీరుపై పార్టీ అధిష్టానం కూడా గుర్రుగా ఉందని తెలుస్తోంది. అయితే నాని మాత్రం తాను అవినీతి, అక్రమాలపై ఫైట్ చేస్తున్నానని, తన ఫైట్ పార్టీకి ఉపకరిస్తుందని పదేపదే చెబుతున్నారు.
''కేశినేని విక్రయించిన బస్సుల కొలతల్లో తేడా, అన్నీ నిబంధనల ప్రకారమే''
కానీ ఆయన తీరు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన అధికారులపై వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడారు.
అప్పటి నుంచే.. చెక్ పెట్టాల్సిందే
కానీ నాని మాత్రం తన దూకుడును తగ్గించలేదు. కేశినేని నాని తన ట్రాన్సుపోర్ట్ (కేశినేని ట్రావెల్స్) బిజినెస్ను హఠాత్తుగా మూసివేశారని, అప్పటి నుంచే సమస్య ఎక్కువ అయిందని టిడిపి సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అప్పటి నుంచి నాని స్వతంత్రంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం తెచ్చేలా ఉందని వారు అంటున్నారు. కేశినేని నాని వంటి వారిని ఇలాగే వదిలేస్తే.. మిగతా వారు కూడా ఇలాగే తయారయ్యే అవకాశముందని కాబట్టి ఆయన దూకుడుకు చెక్ పెట్టాలని అంటున్నారు.
ఉద్దేశ్యపూర్వకంగానే..
నాని ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యక్తిగత లాభం లేదా వ్యక్తిగత బిజినెస్ కోసం ఆయన ఇలా చేస్తున్నారని అంటున్నారు. కేశినేని ట్రావెల్స్ రైవల్ ఆరెంజ్ ట్రావెల్స్. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని ఆసరాగా తీసుకొని నాని అధికారులను టార్గెట్ చేయడం ప్రారంభించారని అంటున్నారు.
అప్పటి నుంచి వ్యక్తిగతంగా తీసుకొని..
కొద్ది నెలల క్రితం రవాణా శాఖ అధికారులతో కేశినేని నాని, బోండా ఉమ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు.. వారిపై సీరియస్ అయి అధికారులకు క్షమాపణ చెప్పించారు కూడా. ఇది కేశినేని నాని ఈగోను హర్ట్ చేసిందని అంటున్నారు. దీంతో ఆయన ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకొని, అధికారులపై దూకుడు పెంచారని అంటున్నారు.
ఎంపీ సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ దాకా..
మరో ఎంపీ సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి కేశినేని లేఖ రాశారని అంటున్నారు. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో అరుణాచల్ రిజిస్ట్రేషన్ బస్సులపై ప్రభావం పడిందని అంటున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ ప్రమాదం ఘటన, అధికారులతో వాగ్వాదం, క్షమాపణ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకొని.. కేశినేని నాని ఇంత రాద్దాంతం చేయడం అధిష్టానానికి ఏమాత్రం రుచించడం లేదని, జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.
సీరియస్ యాక్షన్..
ఎంపి కేశినేని నాని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అధిష్టానం, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవచ్చని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతను ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు ఆవేదనగా ఉన్నారని తెలుస్తోంది.
నానికి గుణపాఠం చెప్పేలా..
ఇష్యూను వ్యక్తిగతంగా తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి బస్సుల రద్దు గురించి లేఖ రాసి, దానిని సాధించిన నానికి.. గుణపాఠం చెప్పాల్సిన అవసరముందని టిడిపిలోనే కొందరు అభిప్రాయపడుతున్నారని సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ లేకుండా కొన్ని విషయాల్లో సర్దుకు పోవాల్సి ఉంటుందని, కానీ నాని అలా చేయలేదని అంటున్నారు.
కేశినేని నాని కంటే బాగా గేమ్ ఆడగలమని..
కాగా, ట్రావెల్స్ విషయంలో కేశినేని నాని ఆడిన గేమ్ కంటే తాము బాగా ఆడగలమని, కానీ ఓపిక పడుతున్నామని, ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ రావొద్దని ఆలోచిస్తున్నామని సీఎంవో కార్యాలయ అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన గొడవ సమయంలో కేశినేని నాని వెంటే ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మౌనంగా ఉన్నారు. కేశినేని నానియే కాకుండా అతని అనుచరులు కూడా స్వతంత్రంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.