అసమ్మతికి బాబు విరుగుడు,శిల్పాకు ఎంఏల్సీ సీటు, భూమా సహకరించేనా?
కర్నూల్ జిల్లాలో టిడిపిలో అసమ్మతికి విరుగుడు ఫార్మూలాను అనుసరిస్తున్నాడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. వైసిపి నుండి టిడిపిలో భూమా నాగిరెడ్డి చేరికను వ్యతిరేకించిన శిల్పా చక్రపాణి రెడ్డి పేరును కర్నూ
కర్నూల్:కర్నూల్ జిల్లాలో టిడిపిలో అసమ్మతికి విరుగుడు ఫార్మూలాను అనుసరిస్తున్నాడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. వైఎస్ఆర్ సి పి నుండి టిడిపిలోకి భూమా నాగిరెడ్డి చేరడాన్ని వ్యతిరేకిస్తున్న శిల్పా సోదరులకు సంతృప్తి చర్యలను చేపట్టింది టిడిపి అధిష్టానం. కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఏల్ సి స్థానానికి టిడిపి అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి పేరును ప్రకటించింది ఆ పార్టీ అధినాయకత్వం.
కర్నూల్ జిల్లాలో వైసిపి నుండి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ శిల్పా సోదరులు పార్టీ నాయకుల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరడంతో తమకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు.
అంతేకాదు ఈ విషయమై సమావేశానికి హజరైన డిప్యూటీ సిఎం కె.ఇ. కృష్ణమూర్తి దృష్టికి కూడ తీసుకెళ్ళారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఒకానొక దశలో శిల్పా సోదరులు పార్టీ మారుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఏల్ సి అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి పేరును కర్నూల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
భూమా నాగిరెడ్డికి, శిల్పా చక్రపారణి రెడ్డికి మధ్య అచ్చెన్నాయుడు సంధి కుదిర్చారు. ఇరువురం కలిసి పనిచేస్తామని అనిపించారు. భూమా నాగిరెడ్డికి శిల్పా మోహన్ రెడ్డి చేత ఆయన కుమారుడి వివాహి పత్రికను ఇప్పించారు. అయినా శిల్పా చక్రపాణి రెడ్డికి భూమా నాగిరెడ్డి సహకరిస్తారా అనేది అనుమానమేనని అంటున్నారు.
భూమా నాగిరెడ్డికి, శిల్పా సోదరులకు చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందువల్ల నాగిరెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డికి సహకరిస్తారా అనేది చర్చనీయాంశమైంది.
భూమా నాగిరెడ్డి పార్టీలో చేరే సమయంలో శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు.నంద్యాల నియోజకవర్గంలో భూమా వర్గీయులకు , శిల్పా చక్రపాణి రెడ్డి వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. శిల్పా వర్గానికి చెందిన నాయకులపై భూమా వర్గీయులు గతంలో దాడులకు దిగారు. ఈ విషయమై పార్టీ అధినేతకు శిల్పా వర్గీయులు ఫిర్యాదు చేశారు.
అయితే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని శిల్పా చక్రపాణి రెడ్డికి ఎంఏల్ సి పదవిని కట్టబెడుతూ టిడిపి నాయత్వం నిర్ణయం తీసుకొంది.సోమవారం సాయంత్రం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కర్నూల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు శిల్పా చక్రపాణి రెడ్డి పేరును ప్రకటించారు .
ఎంఏల్ సి అభ్యర్థుల ఖరారు చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.జిల్లాల్లోనే పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనే ఎంఏల్ సి అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని చంద్రబాబునాయుడు జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఏల్ సి స్థానానికి శిల్పా చక్రఫాణి రెడ్డి పేరును ప్రకటించారు.