ఏపీకి హోదా వస్తే ఏదో ఒరుగుతుందని దుష్ప్రచారం: బాబు ట్విస్ట్
తిరుపతి: తాను ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీకి వెళ్లి 20 సార్లకు పైగా కలిశానని, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశానని, తాను నీతి, నిజాయితీతో ఉన్నందునే తనను ఎవరూ ఏం చేయలేకపోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆయన మహానాడులో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని తాను మొదటి నుంచి కోరుతున్నానని చెప్పారు. ఆర్థిక నష్టాల్లో ఉన్న ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని చెబుతున్నానన్నారు. సంక్షోభం సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నాయని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీతో ఉండే తనను ఎవరూ ఏం చేయలేరని చెప్పారు.
తెలుగు జాతికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలుసునని చెప్పారు. దాని గురించే నిత్యం ఆలోచిస్తున్నానన్నారు. విభజన జరిగిన సమయంలో కేంద్రం తండ్రి పాత్ర పోషించాల్సిందని, ఇద్దరికీ ఆమోదయోగ్య పరిష్కారం చూపించాల్సి ఉండెనని చెప్పారు.
మేం ఇబ్బందుల్లో ఉన్నామని, ఏపీ ప్రజానికానికి ఒక పక్క అనుమానం, మరోపక్క అన్యాయం జరిగిందని, అది మానలేదని సహకరించాలని తాను ప్రధాని మోడీని కలిసినప్పుడు విజ్ఞప్తి చేశానని చెప్పారు. తొందర్లోనే న్యాయం చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు తీరుతాయని, ఏదో జరుగుతుందని కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కావాలని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. ఏపీ తెలంగాణల మధ్య గొడవ అవసరం లేదన్నారు. హోదాపై ఎవరితోను రాజీపడనని చెప్పారు.
టీడీపీ ఆస్తులు రూ.52 కోట్లు
టిడిపి నికర ఆస్తులు రూ.52కోట్లుగా టిడిపి కోశాధికారి, మంత్రి శిద్ధా రాఘవ రావు శుక్రవారం నాడు మహానాడు వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉన్న నికర ఆస్తులను ప్రకటించారు. తొలిరోజు వేదికపై పార్టీ కోశాధికారి, మంత్రి రాఘవరావు ఈ మేరకు పార్టీ జమాఖర్చుల వివరాలను ప్రకటించారు.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అన్నిటినీ ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, విరాళాల రూపంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ.15కోట్లు.
అందులో అయిన ఖర్చు రూ.13కోట్లు. మిగులు సొమ్ము రూ.2.87కోట్లు. సభ్యత్వ రుసుము, విరాళాల ద్వారానే పార్టీకి సమకూరిన ఆదాయం రూ.11,13,12,000. రూ.8.8కోట్ల వరకూ ఇతరత్రా ఖర్చులయ్యాయని వివరాలను ప్రకటించారు.