ఏరికోరి దూరం: రూటుమార్చి పవన్ కళ్యాణ్కు షాకిచ్చిన చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలిసి.. 2014 ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు గట్టి షాకిచ్చారని అంటున్నారు. పవన్ను టిడిపి, బిజెపిలు ఏరికోరి దూరం చేసుకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొన్నటి వరకు.. అంటే ప్రత్యేక హోదా అంశం తేలే వరకు పవన్ కళ్యాణ్ ఎవరి వైపు అనే చర్చ జోరుగా సాగింది.
పవన్ ఎవరి వైపు అనే చర్చ నుంచి..
ఆయన మాటలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లుగా కనిపిస్తోందని, కాదు.. కాదు బీజేపీ తరఫున రంగంలోకి దిగారని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరో విషయం ఏమంటే టిడిపి, బిజెపిల మధ్య విభేదాలు వచ్చాయని, 2019 ఎన్నికల నాటికి ఎవరి దారి వారి చూసుకోనున్నారని, అప్పుడు పవన్ ఎవరి వైపు ఉంటారో అనే చర్చ జరిగింది.
మొత్తానికి పవన్కు షాకిచ్చారు
కానీ, ఆ తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి పవన్కు గట్టి ఝలక్ ఇచ్చాయని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ క్రమంగా దానిని పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ హోదా గురించి మాట్లాడటం సరైందేనని చెప్పిన టిడిపి నేతలు ఆ తర్వాత రూటు మార్చారు.
స్వాగతించి రివర్స్ అయ్యారు
కాకినాడ సభలో పవన్ మాట్లాడిన అంశాల స్వయంగా చంద్రబాబు కూడా స్వాగతించారు. హోదా విషయమై పవన్ మాట్లాడి దాంట్లో తప్పులేదని అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత కేంద్రంతో చర్చల అనంతరం సుజనా చౌదరి హోదా విషయంలో వెనక్కి వెళ్లారు. హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నారు. కేంద్రం మంచి ప్యాకేజీ ఇస్తోందన్నారు.
బీజేపీ కూడా
పవన్ తిరుపతి సభ జరిగిన తర్వాత బీజేపీ నేతలు కూడా ఆయన మాటలను స్వాగతించారు. కాకినాడ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను టిడిపి నేతలు సమర్థించారు. కానీ కొద్ది రోజుల్లోనే అంతా రివర్స్ అయింది.
2019కి ఏరికోరి దూరం చేసుకున్నారు
కేంద్రం హోదా ఇవ్వకుంటే బీజేపీకి టీడీపీ కటీఫ్ చెబుుతుందని చాలా మంది భావించారు. కానీ టిడిపి రివర్స్ అయింది. మరోవైపు, 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని పవన్ చెప్పారు. ఇచ్చిన అతిపెద్ద హామీని నెరవేర్చక పోవడం ద్వారా బీజేపీ, టీడీపీలు.. వచ్చే ఎన్నికల్లో పవన్ను ఏరికోరి దూరం చేసుకున్నాయని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కారణంగా కాపులు టిడిపి-బిజెపికి కూటమికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.