'ఎమ్యెల్యే అశోక్ రెడ్డికి టీడీపీ కార్యకర్తల వార్నింగ్..'
ప్రకాశం : వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ కార్యకర్తల నుంచి సెగ తప్పట్లేదు. కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ భాషాను అక్కడి టీడీపీ ఇంఛార్జీ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్టుగానే, మొన్నీమధ్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పట్ల అక్కడి టీడీపీ కార్యకర్తలు తిరగబడుతున్నారు.
తాజాగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమపై ఆధిపత్యం చలాయించడానికి ప్రదర్శిస్తున్నారని, తమను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ ఏకంగా 600 మంది టీడీపీ కార్యకర్తలు స్థానిక టీడీపీ మంత్రి శిద్దారాఘవరావుకు విన్నవించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ గిద్దలూరు ఇంఛార్జీ అన్నా రాంబాబు అనుచరుల డైరెక్షన్ లో టీడీపీ శ్రేణులంతా తమ నిరసన గళం వినిపిస్తున్నట్టుగా సమాచారం.
కాగా, ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని అదుపులో ఉంచాలని మంత్రి శిద్దారాఘవులుకు విన్నవించిన కార్యకర్తలు, అశోక్ రెడ్డి ఆధిపత్యం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లొ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం.
ఎమ్యెల్యే అశోక్ రెడ్డి చేరికను ముందునుండి వ్యతిరేకిస్తూ వస్తున్న టీడీపీ నేత అన్నా రాంబాబు, టీడీపీ నాయకత్వ తీరును తప్పుబడుతూ ఒంగోలులో జరిగిన మినీ మహానాడుకు కూడా దూరంగా ఉండిపోయారు. అశోక్ రెడ్డి చేరికతో టీడీపీలో తన భవిష్యత్ స్థానమేంటనే దానిపై అసంతృప్తితో ఉన్న అన్నా రాంబాబు, తనకు అన్యాయం చేయాలని చూస్తే.. పార్టీని వీడడానికి కూడా సిధ్దమే అన్నట్టుగా సన్నిహితులతో ప్రస్తావించారన్న చర్చ జరుగురతోంది.