జగన్కు కౌంటర్: పులివెందులలో టీడీపీ జ్ఞానోదయదీక్ష
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్కు మంచిబుద్ధి ప్రసాదించాలని ప్రజలు భగవంతుడిని ప్రార్థించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి రామగోపాల్ రెడ్డి గురువారం కోరారు. జగన్ చేస్తున్న దీక్షలకు నిరసనగా, ఆయనకు భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ గురువారం పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
ఏపీ అగ్రస్థానంలో నిలిపేందుకు 2029 విజన్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు 2029 విజన్ను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు సద్గురు శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు ఆరంభించారు. యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, దాన్ని యోగాను ప్రపంచదేశాలు అనుసరిస్తున్నాయన్నారు.
జీవితంలో సవాళ్లను ఈ శిక్షణతో సమర్ధంగా ఎదుర్కొనవచ్చన్నారు. మూడురోజులపాటు ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్ కార్యక్రమం ఆరంభమైంది. ఒత్తిడిని అధిగమించి పనితీరును మెరుగుపర్చేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో వినూత్నమైందని, దీనివల్ల ఎంతో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగా, మెడిటేషన్లకు కార్పొరేట్ సంస్థలు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. ధ్యానం, ప్రాణాయామం వల్ల ఎంతో మేలు అన్నారు. ఏకాగ్రత పెరిగి ఆరోగ్యం మెరుగవుతుందని చంద్రబాబు చెప్పారు.