హోదాపై మీడియా ప్రశ్నకు సుజన ఫైర్, మోడీకి పత్తిపాటి హెచ్చరిక
విజయవాడ: రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి హెచ్పి చౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి ఇరుకున పడింది. టిడిపి నేతలపై మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడలో కేంద్రమంత్రి సుజనా చౌదరిని హోదా పైన మీడియా ప్రశ్నించింది.
ఈ సందర్భంగా పలు సందర్భాల్లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పిన సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు నిలదీశారు.
దీంతో ఆయన వారిపై మండిపడ్డారు. తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజీనామా లేఖలు మీడియా ప్రతినిధులకు ఇస్తామని, హోదా సాధించి తీసుకురావాలని సవాల్ చేశారు. కేంద్రంలో ఉన్నది తమ మిత్రపక్షమని, హోదా కోసం కష్టపడతామన్నారు.
కాగా, సుజన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా మన హక్కు అని, దాని కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆ విధంగా ముందుకు పోతామని చెప్పారు.
హోదా కోసం పోరాడుతాం: పత్తిపాటి
ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్లో ఇంకుడు గుంతల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉన్నంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోమన్నారు.
రాష్ట్రానికి హోదా ఇచ్చేందుకు ప్రధాని మోడీ నిరాకరిస్తే ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాతో పాటు చాలా హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదగాలంటే ఏపీకి హోదా అవసరమన్నారు.
టిడిపికి విహెచ్ సూచన
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయమై ఏపీకి హామీ ఇచ్చిందని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పైనే ఉందని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టిడిపి బయటకు వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని జోస్యం చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదన్నారు. మోడీ కేబినెట్లోని తన పార్టీ మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయిస్తేనే ఫలితం ఉంటుందన్నారు.