పోటీ ప్రకటన-షాకింగ్ సర్వే: దూరానికి టిడిపి సంకేతాలా, పవన్కు హెచ్చరికనా?
ఓ మీడియా సంస్థ సర్వే నేపథ్యంలో పవన్ - చంద్రబాబు దూరం కావడానికి సంకేతాలా? లేక టిడిపికి దూరం అయితే పవన్ కళ్యాణ్కు నష్టమని హెచ్చరిక చేయడమా? అనే చర్చ సాగుతోంది.
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? సమస్యల పైన పవన్ నిలదీత, వాటికి చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, వివిధ సందర్భాల్లో పవర్ స్టార్ తీరు చూస్తుంటే సైకిల్ పార్టీకి ఆయన దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి.
రాజధాని అమరావతి నుంచి ఏలూరులో ఫార్మా పరిశ్రమ వరకు పవన్ కళ్యాణ్ నిలదీస్తే టిడిపి ప్రభుత్వం వెంటనే, అదీ సానుకూలంగా స్పందించింది. తద్వారా తాము పవన్కు దూరం కాదని, మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామనే అభిప్రాయం కలిగించింది.
ఉర్జీత్ దాకా.. ఆర్నెళ్ల ప్లాన్, మోడీకి పాలాభిషేకం చేసేవారు: నోట్ల రద్దుపై షాకింగ్ సీక్రెట్స్!
అయితే, తాజాగా పరిస్థితులు చూస్తుంటే పవన్ - చంద్రబాబు మధ్య దూరం పెరుగుతుందనేందుకు నిదర్శనాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రముఖ చానల్ చేసిన సర్వేను కూడా ఉదారహణగా చెబుతున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు.
ఆ సర్వేలు అన్ని విధాలుగా టిడిపికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే వైసిపి ప్రతిపక్షానికే పరిమితమని, ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి నష్టమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అదే సమయంలో జనసేన ప్రభావం కూడా ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు.. పవన్ - చంద్రబాబు దూరం కావడానికి సంకేతాలా? లేక టిడిపికి దూరం అయితే పవన్ కళ్యాణ్కు నష్టమని హెచ్చరిక చేయడమా? అనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది.
'అప్పుడు రాజకీయాల్లో మరింత కీలకంగా పవన్ కళ్యాణ్'
ఇటీవలి కాలంలో వివిధ పార్టీలు, ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా వర్గాలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు సర్వే చేసినా తమకే లేదా తాము అనుకూలంగా ఉండే పార్టీకే అనుకూలంగా ఉందని సర్వేలు చెబుతుంటాయి. ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే మరోసారి చర్చనీయాంశంగా మారింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ వల్ల కాపు ఓట్లు టిడిపి - బిజెపి కూటమికి పడ్డాయి. ఆ ఓట్లతో పాటు యువత ఓట్ల కోసమే పవన్ ఎన్నిసార్లు ప్రశ్నించినా టిడిపి సానుకూలంగా స్పందించిందనే వాదనలు ఉన్నాయి. 2019లోను పవన్తో కలిసే ఉండాలని టిడిపి కోరుకుంటోంది.
పవన్ దూరం జరగవద్దని, అనుకోని పరిస్థితుల్లో దూరం జరిగినా తమకు నష్టం లేదని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే జనసేన ప్రభావం లేదని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే పవన్కు దూరం జరగడాన్ని మాత్రం చంద్రబాబు ఏమాత్రం కోరుకోవడం లేదని అంటున్నారు. గతంలో ఆయన తీరు చూసినా అది తేటతెల్లమవుతుందని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే ఫేక్ సర్వే అని వైయస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీతో పొత్తు అంటే టిడిపికే నష్టమని, పొత్తు లేకుంటేనే టిడిపికి లాభమని చెప్పడం పైన కూడా బీజేపీ అసంతృప్తితో ఉందంట. అలాగే, పవన్ కళ్యాణ్ ప్రభావం అంతగా ఉండదని చెప్పడాన్ని ఆయన అభిమానులు, జనసేన జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది.
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏమాత్రం లాభం లేదని, అత్యధికంగా కైకలూరులో 8.7 శాతం మంది మద్దతు మాత్రమే ఉందని, కోస్తాతో పోలిస్తే రాయలసీమలో జనసేనకు కొంచం ఎక్కువ మద్దతు ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో అనుకున్నంత ప్రభావం లేదని సర్వేలో తేలిందని అంటున్నారు.