వర్గీకరణకు పెద్దన్నగా కృషి చేస్తా: మంత్రి రావెల
కృష్ణా: ఎస్సీల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. కృష్ణా జిల్లాలోని ముసునూరు మండలంలోని కాట్రేనిపాడులో సోమవారం జరిగిన శిలువుకొండ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిశోర్బాబు మాట్లాడుతూ.. మాదిగల సంక్షేమానికి టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారని అన్నారు. మాదిగలకు ఎక్కువ స్థానాలు కేటాయించి అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రాతినిథ్యం కల్పించారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు మాదిగ జాతి పెద్దన్నగా తాను కృషి చేస్తానని రావెల కిశోర్ బాబు అన్నారు. ఆయన వెంట ఉత్సవ నిర్వాహకులు చిట్టిబాబు మాదిగ, పలువురు టిడిపి నేతలు ఉన్నారు.
చేపల ఉత్పత్తిలో ఏపిది అగ్రస్థానం: పత్తిపాటి
చేపల ఉత్పత్తి ఆదాయంలో ఏపిదే అగ్రస్థానమని రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడలో రాష్ట్ర చేపలు, రొయ్యల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదేళ్లలో లక్ష40వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పత్తిపాటి తెలిపారు.
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో ఒక చోట వంద ఎకరాల్లో చేపల ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేపల ఉత్పత్తిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అక్వాకల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. పురపాలక సంఘాల్లో ఆధునాతన ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని, నారాయణ పాల్గొన్నారు.