జగన్ కల కల్లలు, కడప జిల్లాలో ఆ ఇద్దర్ని కలిపి షాకిచ్చిన చంద్రబాబు!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చారని అంటున్నారు. జగన్ సొంత ఇలాగా కడపలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు కలిశారు.
ఇది జగన్కు పెద్ద షాక్ అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి వైసిపి నుంచి 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఆయన రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. ఇరువురి మధ్య ఎంతకూ పొసిగినట్లు కనిపించలేదు. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది.
అయితే, ఇప్పుడు ఇద్దరు ఏకమయ్యారు! ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలు కలవరన్న కల కల్లలైందని, వారిద్దరూ ఒకే వేదిక పైకి వచ్చి కలిసిపోయారని జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం అన్నారు. ఎర్రగుంట్లలో జనచైతన్య యాత్రల సందర్భంగా మంగళవారం సభలో మాట్లాడారు.
ముందుగా నాలుగు రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా ముద్దనూరు రోడ్డులోని జడ్పీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశ సరిహద్దుల్లోని ఉరిలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీరజవానులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడారు.
దివంగత ఎన్టీఆర్ను ప్రతి కార్యకర్త స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. దశాబ్దాల కాలం నుంచి వైరమున్న ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి వచ్చారని, దీనిని బట్టి రాష్ట్రంలో ఎక్కడా సమస్యలుండవన్నారు. 175 స్థానాల్లో జమ్మలమడుగు నుంచే అత్యధిక మెజార్టీ వస్తుందన్నారు.
వైసీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి మొదటి వికెట్గా వచ్చారని తర్వాత 20 వికెట్లు పడ్డాయన్నారు. టీడీపీకి జమ్మలమడుగు మళ్లీ కంచుకోటగా మారాలని తద్వారా రాష్ట్రానికి మంచి సందేశం పంపాలన్నారు.
రాబోయే శీతాకాల సమావేశాల తర్వాత వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని, అప్పటి వరకు ఎందుకని, ఇప్పుడే రాజీనామా చేయిస్తే కడప నుంచే బుద్ధి చెబుతామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.
తామంతా ఒక్కతాటిపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. ప్రజలంతా టిడిపి వైపే ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికలను తాము కూడా రెఫరెండంగా స్వీకరిస్తామన్నారు. కడప జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని, అందుకు జమ్మలమడుగే వేదిక అవుతుందన్నారు. ఎర్రగుంట్ల మండలాన్ని, జమ్మలమడుగు నియోజవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఇద్దరు నాయకులతో కలిసి సాధ్యం చేస్తామన్నారు.