అనుచరులతో శిల్పా భేటీ: అలా జరిగితే పార్టీ మారే యోచన?
నంద్యాల : మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి తన అనుచరులతో సోమవారం నాడు సమావేశమయ్యారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి ఆయన రంగం సిద్దం చేసుకొంటున్నారు.అయితే పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై శిల్పా తన అనుచరులతో సమాలోచనలు నిర్వహించారు.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే ఈ ఎన్నికల్లో భూమా కుటుంబానికి చెందిన వారు బరిలోకి దింపాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
అయితే ఈ ఎన్నికల్లో తాను బరిలోకి దిగాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు తన అనుచరులతో శిల్పా సమావేశమయ్యారు.పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోతే పార్టీని వీడే యోచనలో మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో పార్టీ టిక్కెట్టు దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని కూడ యోచిస్తున్నారు శిల్పా మోహన్ రెడ్డి.అయితే ఇటీవలనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా సోదరుడు చక్రపాణి రెడ్డి విజయం సాధించారు.
అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా పోటీచేయాలనే ఆలోచనను సోదరుడు చక్రపాణి రెడ్డి వ్యతిరేకించారని సమాచారం.అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు దక్కకపోతే పార్టీ మారితే ఎలా ఉంటుంది. లేదా స్వతంత్రంగా పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయమై శిల్పా మోహన్ రెడ్డి అనుచరులతో చర్చించారని సమాచారం.