టీడీపీలో భగ్గుమన్న కక్షలు: సొంత పార్టీ నేతనే కత్తులతో పొడిచారు
టీడీపీకి చెందిన నల్లపనేని అమర్నాథ్ పై అదే పార్టీకి చెందిన కనకారావు అనే నేత 12మంది అనుచరులతో కలిసి కత్తులతో దాడి పాల్పడ్డాడు.
గుంటూరు : ఒకే గూటి నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కక్షలు ప్రతీకారేచ్చలతో రగిలిపోయిన అంతర్గత పోరు కాస్త కత్తులతో దాడిచేసుకునే దాకా వచ్చింది. గుంటూరులో అధికార పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడం.. అవి కాస్త ప్రాణాలు తీసేదాకా వెళ్లడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజా ఘటన విషయానికొస్తే.. టీడీపీకి చెందిన నల్లపనేని అమర్నాథ్ పై అదే పార్టీకి చెందిన కనకారావు అనే నేత 12మంది అనుచరులతో కలిసి కత్తులతో దాడి పాల్పడ్డాడు. దాడిలో గాయపడ్డ అమర్నాథ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 12మంది అనుచరులతో కలిసి ఆటోలో వచ్చిన కనకారావు తొలుత అమర్నాథ్ పై దాడి చేసి.. అనంతరం అమర్నాథ్కు చెందిన న్యూ గీత హోటల్ పై కూడా దాడికి పాల్పడ్డాడు.
హోటల్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కాగా, త్వరలో జరగబోయే గుంటూరు కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య బుధవారం నాడు ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టుగా సమాచారం.
అది కాస్త ఘర్షణకు దారితీయగా.. కనకారావుపై అమర్నాథ్ దాడి చేశాడు. దీనికి ప్రతీకారంగా గురువారం సాయంత్రం అనుచరులతో కలిసి కత్తులతో దాడికి తెగబడ్డాడు కనకారావు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.