కెసిఆర్పై ఎపి టిడిపి సమరం: కొత్తగా కుట్ర కోణం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై సాగిస్తున్న సమరంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకులు, మంత్రులు కొత్త కోణాన్ని ముందుకు తెస్తున్నారు. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ముందుకు తెచ్చి కెసిఆర్ను ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఎపి ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే కొత్త కోణాన్ని ముందుకు తెచ్చారు.
మంత్రి కిశోర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు ఈ కొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లిందని జూపూడి ఆరోపించారు. సర్వీసు ప్రొవైడర్లు తెలంగాణ ప్రభుత్వం ఏమడిగితే అది ఇచ్చారనీ, అదే ఏపీ ప్రభుత్వం చట్టబద్ధంగా కోరితే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ ప్రభుత్వం ఎపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పడానికి మరో అంశాన్ని ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఆయన గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కొన్ని కంపెనీలకు ఇందుకు సంబంధించి ఈ మెయిల్స్ పెడుతున్నాయని ఆయన చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయనిఅన్నారు. తమ ఎపి ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని రావెల చెప్పారు.