జగన్కే బుద్ధి లేదు, ఇక వారికి ఉంటుందా: టిడిపి తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని, ఆయనకే లేని బుద్ధి ఇక ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులకు ఎలా వస్తుందని, వారి నుంచి అది ఆశించడంతప్పవుతుందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు.
ఆయన ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. గుడ్లగూబలు వెలుగును, గుంటనక్కలు మంచిని చూడలేవని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకుల వ్యవహారం కూడా అలానే ఉందన్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
చెప్పులు కొనుక్కునే స్థోమత లేనివారు ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్తున్నారంటే వారి వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స, ఏపీఐసీసీ భూముల స్కాంలో రూ.వందల కోట్లు మింగిన అంబటికి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కర్నూలులో జగన్ యువభేరీ
వైసిపి అధినేత వైయస్ జగన్ మంగళవారం కర్నూలులో నిర్వహించనున్న యువభేరీ సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా విషయమై విద్యార్థులు, యువతతో ఆయన ఈ సదస్సుల్లో చర్చించడంతోపాటు, హోదా ఆవశ్యకతపై మాట్లాడుతారు.
అలాగే నవంబరు ఆరో తేదీన విశాఖ మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని వైసిపి నిర్ణయించింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు తీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి 25 అంశాలు అజెండాగా ఈ సభను వైసిపి నిర్వహిస్తోంది.