తండ్రిలాగే జగన్ కుల రాజకీయాలు: అనిత, సాక్షి మీడియాపై ఫైర్
విశాఖపట్నం: తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే కుల రాజకీయాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తిరిగి తీసుకొస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆమె సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
కుల రాజకీయాలు చేయొద్దని ప్రతి పక్ష నేతలకు విన్నవిస్తున్నామని చెప్పారు. ముద్రగడ దీక్ష విరమింప చేసిన రోజు సీఎం చంద్రబాబు మాటలను జగన్కు చెందిన మీడియా వక్రీకరించిందని అన్నారు. చంద్రబాబు మాటలు ముందు వెనుక కట్ చేసి వక్రీకరించి చూపిందన్నారు. నేటికీ పులివెందుల, ఇడుపుల పాయల చర్చిల్లో దళితులు రాలేని స్థితిలో ఉన్నారన్నారు.
ప్రతిపక్ష నేతగా దళితుల కోసం మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. అసెంబ్లిలో దళితురాలైన తనను రోజా అవమానిస్తుంటే ఖండించని జగన్ నేడు ఏ విధంగా చంద్రబాబుపై అభాండాలు వేస్తున్నారన్నారు. తన తండ్రి వైఎఎస్ఆర్ అప్పట్లో మర్రి చెన్నారెడ్డిని పదవి నుంచి దించేందుకు హైదరాబాద్ పాతబస్తీలో కుల రాజకీయాలు సృష్టించారన్నారు. నేడు అదే తీరును జగన్ కొనసాగిస్తున్నాడన్నారు.
అప్పుడు ఎస్సీ ఎస్టీలకు 65 కోట్లు మాత్రమే ఇచ్చారని, నేడు చంద్రబాబు రూ.1000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు మంజూరు చేశారన్నారు. ఈ ఒక్కటి చాలు చంద్రబాబుకు ఎస్సీ ఎస్టీలంటే ఎంతో గౌరవమని చెప్పేందుకు ఉదాహరణ అని అన్నారు. మందకృష్ణ మాదిగ తెలంగాణా పోరాటంలో ఆంధ్రోళ్లు ఎవరూ రావొద్దన్నారు.
ఇపుడు అదే మందాకృష్ణ మాదిగ ఏపీలో 10 లక్షల మందితో సమావేశం పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి పక్ష నేతలు బస్మాసురుల్లా తయారయ్యారని విమర్శించారు. అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి పోటీ చేస్తే అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఓడించారన్నారు.
అంబేద్కర్ గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, అది నచ్చక ఆ మహనీయుడ్ని ఓడించారన్నారు. అంత మంచి వ్యక్తిని అప్పట్లోనే వివక్షకు గురి చేశారన్నారు. దళితుల మానసిక క్షోభ చంద్రబాబుకు తెలుసునని, అందుకే వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.