ఎన్టీఆర్ మానస పుత్రికను పూర్తి చేసి అనంతకు నీళ్లిస్తాం: బాలకృష్ణ
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానస పుత్రిక అని, జనవరిలోగా ప్రాజెక్టును పూర్తిచేసి కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా వాసులకు నీరందిస్తామని ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఆయన శనివారం అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలోని చలివెందుల వద్ద నిర్మిస్తున్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను బాలకృష్ణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానస పుత్రిక అని, జనవరిలోగా ప్రాజెక్టును పూర్తిచేసి కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా వాసులకు నీరందిస్తామని చెప్పారు.
ఆ తర్వాత పట్టణంలోని బిట్ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆయన చిలమత్తూరు మండలానికి వెళ్లినట్లు సమాచారం.
కాగా, శుక్రవారం హిందూపురంలో పర్యటించిన సందర్భంగా ‘ఎన్టీఆర్ భరోసా' పథకంలో భాగంగా అర్హులైన వారికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. హిందూపురంలో కొత్తగా నిర్మించనున్న కూరగాయల మార్కెట్ ప్రణాళికను ఆయన పరిశీలించారు.