జగన్ పార్ట్టైం పొలిటీషియన్: టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ సాగింది. హుధుద్ తుఫాను తదితర అంశాల పైన ప్రతిపక్ష నేత వైయస్ జగన్, మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభాపతి సభను పదినిమిషాలు వాయిదా వేశారు.
సభలో జగన్ మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను సమయంలో ఆహార పొట్లాలను విసిరేశారని, అలా చేయడమేమిటని ప్రశ్నించారు. అలా మీకు విసిరేస్తే తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. అందరు అభినందిస్తున్నారని, అభినందించని వారిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. 11 ఛార్జీషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సభలో సభ్యుడైనందుకు తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూన రవికుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు పని విధానం రాజకీయ వ్యవస్థపై నమ్మకం పెంచేలా ఉందన్నారు. హుధుద్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. వైసీపీ ధర్నా చేసి అబాసుపాలయిందన్నారు. ఈ సమయంలో జగన్ను కూన పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్నారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై గందరగోళం
మంత్రి అచ్చెన్నాయుడు జగన్ను ఉద్దేశించి.. 11 ఛార్జీషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సభలో సభ్యుడైనందుకు సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ పదినిమిషాలు సభను వాయిదా వేశారు.