యరపతినేని Vs పిన్నెల్లి: ఆధిపత్య పోరేనా, పల్నాడులో అసలేం జరిగింది?
అమరావతి: గుంటూరు జిల్లాలోని పల్నాడు రాజకీయం అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా వెడేక్కింది. సోమవారం గురజాలకు చెందిన యరపతినేని శ్రీనివాసరావు, మాచర్లకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఒక్కసారిగా మాటల యుద్ధానికి తెరలేవడానికి కారణం ఏమై ఉంటుంది. ఎప్పటి నుంచో పల్నాడు ప్రాంతంలో ఆధిపత్య పోరు కోనసాగుతోంది. 2014 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు క్రమ క్రమంగా తమ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పల్నాడు ప్రాంతంలో యరపతినేని Vs పిన్నెల్లి కుటుంబాలకు మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు సాగుతోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాలకు చెందిన యరపతినేని శ్రీనివాసరావు ఆ పక్కనే ఉన్న మాచర్ల నియోజకవర్గంపై కూడా తన పట్టుని నిలుపుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైసీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇది ఎంత మాత్రం నచ్చడం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇటీవలే ముగిసిన కృష్ణా పుష్కరాలను అస్త్రంగా ఎంచుకుని యరపతినేనిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. గుంటూరు జిల్లాలో ఉన్న కృష్ణా తీరం వెంబడి ఘాట్ల నిర్మాణం అయితే గానీ, పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సుమారు రూ. 20 కోట్లకు పైగా అవినీతి జరిగిందని దానిని నిరూపించేందుకు తాను సిద్ధమని యరపతినేనికి సవాల్ విసిరారు.
అయితే పిన్నెల్లి విసిరిన సవాల్ను యరపతినేని కూడా స్వీకరించారు. ఈ అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు నియోజక వర్గంలోని దాచేపల్లి మార్కెట్ యార్డుని వేదికగా నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లు శాంతి భద్రలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని గుర్తించిన జిల్లా ఎస్పీ సోమవారం దాచేపల్లి మార్కెట్ యార్డుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే హౌస్ అరెస్ట్లో ఉన్నా ఎమ్మెల్యేలిద్దరూ తమ సవాళ్లు, ప్రతి సవాళ్లను మాత్రం మానుకోలేదు. మధ్యాహ్నాం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనుల్లో యరపతినేని ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటే, తనను హౌస్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
దీంతో పాటు గురజాలలో యరపతినేనిపై తాను పోటీ చేస్తానని ఎవరు ఓడిపోతే వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిన్నెల్లి చెప్పారు. యరపతినేని మైనింగ్ లో అవినీతికి పాల్పడ్డారని లోకాయుక్త కూడా నిర్ధారించిందని చెబుతూ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరం రాజీనామా చేద్దామన్నారు.
దమ్ముంటే యరపతినేని తన సవాల్ను స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రాజీనామా సవాల్ను యరపతినేని స్వీకరించారు. ఎమ్మెల్యే కాకముందు బస్సుల్లో దోపిడీలు చేయించిన పిన్నెల్లి ఇప్పుడు నీతులు చెబుతున్నారని యరపతినేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసరారు. పిన్నెల్లి చేతనైతే తన పార్టీ నుంచి గురజా సీటు తెచ్చుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో పిన్నెల్లిపై ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని యరపతినేని స్పష్టం చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. అవినీతి పార్టీలో ఉన్న అతను నాపై బురద జల్లితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విగ్రహాల దొంగ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని యరపతినేని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో ఆదివారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.