రోజా సహా 9 మందిపై నోటీస్: చర్యలు తప్పవా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన 9 మంది శానససభ్యుల అసభ్య ప్రవర్తనపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నోటీసు ఇచ్చారు. ఆ 9 మంది వైసిపి ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్ను కోరారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, నాని, అనిల్కుమార్, శ్రీధర్రెడ్డి, శివప్రసాద్, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, రోజాను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై బుధవారంనాడు సభలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వారిపై చర్యలు తప్పవా అనే సందేహం కలుగుతోంది. సోమవారంనాడు చోటు చేసుకున్న పరిణామాలు కూడా అందుకు అనుగుణంగానే నడిచాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దూషణల వ్యవహారం తీవ్రరూపం దాలుస్తోంది. ఈ దూషణలపై శాసనసభ కార్యాలయం న్యాయ సలహా కోరినట్లు సమాచారం. శాసనసభ కార్యాలయం పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఏపీ అసెంబ్లీకి వచ్చారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సభలో జరిగిన పరిణామాలను ఏజీకి వివరించినట్లు వార్తలు వచ్చాయి. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో పోడియం వద్ద ఆందోళన సందర్భంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ను దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అదే రోజు ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి మూడు రోజులపాటు సస్పెండ్ చేశారు. తాను సభలో సభాధ్యక్ష స్థానంలో కూర్చుని ఉండగా తన ఎదురుగానే తనను వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా దూషించడంపై స్పీకర్ కలత చెందినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన రికార్డులు సేకరించాలని ఆయన చీఫ్ విప్ను కోరినట్లు సమాచారం. శాసనసభాపతి కార్యాలయం కూడా ఈ రికార్డులను సేకరించింది. ఈ రికార్డుల్లోని అంశాలను ఏజీకి అసెంబ్లీ కార్యదర్శి నివేదించారు. అయితే, ఏజీ ఇచ్చిన న్యాయ సలహా ఏమిటో బహిర్గతం కాలేదు. కానీ, చర్య తీసుకోవడానికి అర్హమైన వ్యవహారంగా ఆయన భావించినట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం శాసనసభ్యత్వాన్ని ఏకంగా రద్దు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక సభలో ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారన్నది బలరాంపై అభియోగం.
స్పీకర్పై ఎమ్మెల్యేలు దూషణకు పాల్పడినప్పుడు ఇతర రాష్టాల్లో ఎలా స్పందించారో కూడా శాసనసభ కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. స్పీకర్పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలుకాక సభలో మరి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. తమను వైసీపీ ఎమ్మెల్యేలు తిట్టారని టీడీపీ ఎమ్మెల్యేలు తమనే టీడీపీ ఎమ్మెల్యేలు దూషించారని వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు. వాటన్నింటినీ సభా హక్కుల కమిటీకి నివేదించే అవకాశం ఉంది. స్పీకర్పై వ్యాఖ్యల వ్యవహారం మాత్రం ప్రత్యేక కేసుగా పరిగణించే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే అడ్వొకేట్ జనరల్ను పిలిచి న్యాయ సలహా కోరినట్లు చెబుతున్నారు.
మరోవైపు, అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ను దూషించటంపై చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏపీ అసెంబ్లీ హాల్లో సోమవారం సభా హక్కుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సభ్యులపై వచ్చిన ఫిర్యాదులను కమిటీ పరిశీలించింది. దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించాల్సి ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 31న మరోసారి భేటీ కావాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.