లోకేష్కు అంత చరిష్మా ఉందా?, పులివెందులలో జగన్పై పోటీనా!, సవాల్ చేసి మరీ..
బుద్దా వెంకన్న ఏ ధైర్యంతో ఈ మాటన్నారో గానీ.. లోకేష్ను ఇక్కడినుంచి పోటీకి దింపడం మాట అటుంచితే.. ఇలాంటి సవాళ్లు లోకేష్ పొలిటికల్ కెరీర్ను ప్రమాదంలో పడేయడం ఖాయం.
కడప: ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా దొడ్డిదారిన రాజకీయ రంగప్రవేశం చేశాడని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సందర్భం వచ్చినసారి లోకేష్ ను ఉతికారేస్తున్నారు.
దీనికి తోడు పదే పదే ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పులతో ప్రతిపక్షానికి కావాల్సినంత ఉప్పు అందిస్తున్నాడు లోకేష్. దీనిపై సోషల్ మీడియా జనం ఆయన్ను ఏకిపారేయడంతో.. చివరకు సోషల్ మీడియా పైనే చర్యలు తీసుకుంటానని, ఆవిధంగానూ అభాసుపాలయ్యారు.
ఇలా అయితే లాభం లేదు.. ఇక ఆయన చరిష్మా పెంచాలని టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లు ఉన్నారు. ఏకంగా జగన్ పైనే పోటీకి కాలు దువ్వుతున్నారు. అది కూడా జగన్ కంచుకోట అయిన పులివెందులలో. దమ్ముంటే జగన్ పులివెందుల సీటు ఖాళీ చేయాలని, తమ యువనేత నారా లోకేష్ ఆ స్థానంలో పోటీ చేసి గెలుస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా సవాల్ విసిరారు.
బుద్దా వెంకన్న ఏ ధైర్యంతో ఈ మాటన్నారో గానీ.. లోకేష్ను ఇక్కడినుంచి పోటీకి దింపడం మాట అటుంచితే.. ఇలాంటి సవాళ్లు లోకేష్ పొలిటికల్ కెరీర్ను ప్రమాదంలో పడేయడం ఖాయం. ఇదే మాట పట్టుకుని రేప్పొద్దున వైసీపీ వాళ్లు కూడా.. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే జగన్ పై పోటీ చేయాలని లోకేష్ కు సవాల్ విసిరితే పరిస్థితేంటి?. లేని చరిష్మాను ఊహించుకుని వైసీపీ నోటికి పని చెప్పడమే తప్పితే.. ఇలాంటి సవాళ్లతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
రోజాను కూడా మోసం చేయడం ఖాయం:
లోకేష్ తీరు జబర్దస్త్ షోను మించిపోయిందని ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ దర్శకత్వంలో రోజా జబర్దస్త్-2 చేస్తున్నారని విమర్శించారు. జగన్, రోజా ఇద్దరూ 420లు అని.. వీళ్లా చంద్రబాబుని 420 అనేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా సురేఖ, సబ్బంహరి, కొణతాల మాదిరిగానే జగన్ రోజాని కూడా మోసం చేయడం ఖాయమన్నారు. అది జరిగిన రోజు రోజా జగన్ని తిట్టడం కూడా గ్యారటీ అని చెప్పారు.