జగన్! పులివెందుల వీధుల్లో తేల్చుకుందామా: సతీష్
హైదరాబాద్: పులివెందుల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేశారని, అదనంగా రెండు టీఎంసీలతో కలిపి మొత్తం ఐదు టీఎంసీలు ఇచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేశారని మండలిలో సతీష్ రెడ్డి బుధవారం ధ్వజమెత్తారు.
గడిచిన పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గానికి ఎంత సాగు నీరు అందింది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎంత నీరు అందుతుందో దీని పైన బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ధైర్యముంటే పులివెందుల వీధుల్లో తేల్చుకుందామన్నారు.
ప్రతిపక్ష నేత జగన్కు చాలా బాధగా ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం ఉదయం శాసన సభ ప్రారంభమైన తర్వాత అన్నారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ 43 శాతం పెంపును సమర్థించకుండా ఎత్తిచూపిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ టాపిక్ ఇంకా పూర్తికాకముందే ఫైనాన్స్ గురించి ఏమాత్రం అవగాహన లేని మంత్రి మాట్లాడుతున్నారన్నారు.
జగన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగా ఉంటుందని భావించామన్నారు. రాష్ట్రంలో 8.4 శాతం వృద్ధిరే టు సాధించామని గొప్పలు చెప్పుకున్నారని, దేశం కన్నా ఒక శాతం వృద్ధి రేటు చూపించగలిగామని గొప్పగా చెప్పుకున్నారన్నారు. 2015-16లో ఆర్థిక సంఘం అదనపు నిధులు ఇచ్చిందని, కేంద్రం నుంచి పన్నుల వాటా పెరిగిందని అయినప్పటికీ బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు.
ప్రణాళికేత వ్యయాన్ని రూ.11వేల కోట్లు తగ్గించడం ఆశ్చర్యకరమన్న జగన్ జీతాలు, పించన్లు తగ్గుతాయా, వడ్డీలు తగ్గుతాయా, నిర్వాహణ ఖర్చులు తగ్గుతాయా అని ప్రశ్నించారు. నాన్ప్లానింగ్ ఎక్సెండీచర్ తగ్గిందన్నారు. 2014-15 సంవత్సరంలో జీతాలను రూ..29,870 కోట్లుగా చూపించారని, ఫిట్మెంట్ తర్వాత జీతాలు 16 శాతం పెరిగాయని జగన్ వివరించారు.