చంద్రబాబుక షాక్: వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్సీ!
అమరావతి: వైయస్ 67వ జయంతి ఉత్సవాల సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పాటు నారాయణ రెడ్డి కూడా విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
అయితే శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల్లోకి వెళితే... శుక్రవారం వైయస్ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖరరెడ్డికి ఆ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు.
అయితే ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తన సొంతూరు దేవగుడిలో వైయస్ విగ్రహానికి ఘన నివాలి అర్పించారు. అంతేకాదు భారీగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆ సమయంలో అదే ఊరిలోని తన సొంతింటిలో ఉండగానే దేవగుడి వైఎస్కు నివాళి అర్పించడం పెద్ద చర్చనియాంశమైంది.
వైసీపీ తరుపున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరిన దేవగుడి నారాయణరెడ్డి వైయస్ జయంతి రోజన ఆయన విగ్రాహానికి నివాళులర్పించి భారీగా అన్నదాన కార్యక్రమం చేయడం ఏంటని కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయి.
కాగా వైఎస్ కుటుంబంతో మూడున్నర దశాబ్దాలుగా నారాయణ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటం విశేషం. ఈ కారణం చేతనే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నారాయణరెడ్డికి ఇంకా వైయస్పై అభిమానం చావలేదనే మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉంటూ వైయస్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఏకైకన నేత నారాయణ రెడ్డే కావడం విశేషం.