తన ఉనికిని కాపాడుకునేందుకే: గాలి, చిచ్చు పెట్టేందుకే జగన్ దీక్ష: మంత్రి దేవినేని
గుంటూరు: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే దీక్ష చేపట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. బుధవారం ఆయన చిత్తూరులో ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ దీక్షలో చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే జగన్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ గుంటూరు జిల్లాలోని నల్లపాడులో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బుధవారం నిరవధిక దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.
జగన్ దీక్షపై పంచుమర్తి అనురాధ
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తలపెట్టిన దీక్షపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి మండిపడ్డారు. బుధవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రతిపక్షనేత జగన్ చీటింగ్లో ఎక్స్పర్ట్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో ఎక్స్పర్ట్' అని అన్నారు.
జగన్ మతిస్థిమితం లేక దీక్ష చేస్తున్నారని, జగన్ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. జగన్ దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జగన్కు దీక్ష చేసే అర్హత లేదు: మంత్రి దేవినేని
11 కేసుల్లో ముద్దాయి అయిన జగన్కు దీక్ష చేసే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఓర్వలేకే చిచ్చు పెట్టేందుకు జగన్ దీక్ష చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాడు భూమిపూజకు రైతులను రెచ్చగొట్టేందుకు దీక్ష చేశారు, ఇప్పుడు శంకుస్థాపన సమయంలో ప్రత్యేకహోదా కోరుతూ దొంగదీక్ష చేస్తున్నాడని మండిపడ్డారు.