కేశినేని నాని వీరంగం: జగన్ను లాగిన చంద్రబాబు, వైసిపి చీఫ్ ట్రావెల్స్కు షాక్!
విజయవాడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఘటనపై టిడిపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది.
విజయవాడ: విజయవాడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఘటనపై టిడిపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది. ఈ రగడ గురించి వివరించేందుకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు చంద్రబాబు వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఆయన క్లాస్ పీకిన తర్వాత వారు మీడియా ఎదుట, ఆ తర్వాత స్వయంగా ట్రాన్సుపోర్ట్ అధికారిని కలిసి క్షమాపణ చెప్పారు. అయితే, తనను కలిసిన టిడిపి నేతలపై చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
నాకంతా తెలుసు, ఆఫీసర్కు సారీ చెప్పండి: సహించనని బాబు ఆగ్రహం
ఎంపీ
కేశినేని
నాని,
ఎమ్మెల్యే
బొండా
ఉమ,
ఎమ్మెల్సీ
బుద్దా
వెంకన్నలు
తన
వద్దకు
రాగా..
వారు
వ్యవహరించిన
తీరుపై
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
తక్షణం
రవాణశాఖ
కమిషనర్ను
కలిసి
క్షమాపణ
చెప్పాలని
ఆదేశించారు.
శనివారం
రవాణా
శాఖ
కార్యాలయం
వద్ద
జరిగిన
ఘటనపై
ఉద్యోగులు
సీరియస్గా
ఉన్నారు.
మరోవైపు,
చంద్రబాబు
శనివారం
నాటి
పరిణామాలను
తీవ్రంగా
పరిగణించారు.
ఆదివారం ఉదయాన్నే ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్నారు. టిడిపి నేతలది తప్పేనన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నను తన ఇంటికి రావాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వారు ఆగమేఘాలపై ఆయన ఇంటికి చేరుకున్నారు. గంటకుపైగా వారితో మాట్లాడిన సీఎం ముగ్గురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్కు మీకు తేడా ఏమిటి
అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిపక్ష నేత జగన్ అధికారులపై విరుచుకు పడుతున్నాడని మనం తిడుతున్నామని, నిన్న మీరు చేసిందేమిటని, ఐపీఎస్ అధికారి గన్మెన్ను తోసేస్తారా అని మండిపడ్డారు. మీకు జగన్కు తేడా ఏమిటని కూడా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారని, మీరు చేసిన పనితో పార్టీకి చెడ్డపేరు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ వల్ల వైసిపి ప్రశ్నిస్తోంది
అసలు రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లకుండా ఉండాల్సిందని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది. అయితే, తాము ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో ఎంపీ, ఎమ్మెల్యే వివరించినట్లు సమాచారం. దీంతో సీఎం స్పందిస్తూ.. అధికారులతో మీకేదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకు రావాలే తప్ప, నేరుగా మీరు అధికారులతో గొడవకు దిగడం ఏమిటని నిలదీశారు. మీరు చేసిన పని ప్రతిపక్ష నేతలకు మనల్ని తప్పుబట్టే అవకాశాన్ని ఇచ్చిందన్నారు.
నేతలు వ్యవహరించిన తీరు సరికాదని వ్యాఖ్యానించిన సీఎం, తక్షణం రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సీఎం ముగ్గురు నేతలకు సూచించారు. అధికారంలో ఉన్నవారు అరిటాకుల్లాంటి వారని, తప్పు ఎవరిదైనా అధికారంలో ఉన్న వారు కాస్త తగ్గి ఉండాలన్నారు.
చంద్రబాబు అందుకే మందలించారు
రవాణాశాఖ కమిషనర్ను కలిసిన అనంతరం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు తమకు తండ్రిలాంటి వారని, మమ్మల్ని సరైన దారిలో పెట్టేందుకే ఆయన తమను మందలించారని కేశినేని నాని తెలిపారు. రవాణాశాఖ కమిషనర్కు క్షమాపణ చెప్పమని సీఎం ఆదేశించడంతో బాలసుబ్రమణ్యంను కలిసి సారీ చెప్పామన్నారు.
జగన్ ట్రావెల్స్ నిలిపివేయిస్తాం
సీఎం ఆగ్రహం చూస్తుంటే.. తప్పు చేసిన పిల్లలను తండ్రి మందలించినట్లు ఉందన్నారు. ఇంతటితో ఈ వివాదం ముగిసినట్లేనని రాష్ట్రాభివృద్ధికి అధికారులతో కలిసి పనిచేయాలన్న సీఎం ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. అయితే చట్టవ్యతిరేకంగా తిరుగుతున్న జగన్కు చెందిన బినామీ ట్రావెల్స్ను ఏప్రిల్ 1 నుంచి నిలిపి వేయిస్తామన్నారు. తనకు పార్టీనే ముఖ్యమని సీఎం ఆదేశిస్తే తను బస్సులన్నీ ఆపేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు మానాలని, పార్థసారధి, వెల్లంపల్లి చరిత్ర తమకు తెలుసునని కేశినేని నాని అన్నారు.
వివాదం ముగిసింది: బాలసుబ్రమణ్యం
టిడిపి నేతలు తనకు క్షమాపణ చెప్పారని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. తమకు ఎవ్వరిపైనా ప్రత్యేక అభిమానం, ద్వేషం లేవని, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన బస్సు ప్రమాదంలో సాంకేతిక లోపం ఎలా చూపగలమని ప్రశ్నించారు. ఏదేమైనా శనివారం టిడిపి నేతలు అలా వ్యవహరించి ఉండాల్సింది కాదన్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో రవాణాశాఖ ఉద్యోగులు పాటించిన సంయమనానికి కమిషనర్ కితాబు ఇచ్చారు. క్షమాపణ చెప్పిన తర్వాత వివాదాన్ని రాజకీయం చేయడం సరికాదని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామన్నారు.
అయినా తగ్గని జేఏసీ నేతలు
చంద్రబాబు చూపిన చొరవతో టిడిపి నేతలు రవాణాశాఖ కమిషనర్కు క్షమాపణ చెప్పడంతో రవాణాశాఖ ఉద్యోగుల జేఏసీ నేతలు కాస్త శాంతించారు. శనివారం నాటి ఘటనపై సీఎం చొరవ బాగున్నా మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎంపీ నాని, ఎమ్మెల్యే ఉమపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆదివారం విజయవాడలో భేటీ అయిన జేఏసీ నేతలు శనివారం నాటి ఘటనలపై చర్చించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే సోమవారం నుంచి పెన్డౌన్కు సిద్ధమవుతామని ప్రకటించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే తాము ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే టిడిపి నేతలు ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పడంతో కమిషనర్ వివాదం ముగిద్దామన్నారు.