పెద్ద నోట్ల రద్దుపై నిరసన: చంద్రబాబును శివప్రసాద్ ధిక్కరిస్తున్నారా?
మోడీ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని టిడిపి ఎంపి శివప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సమర్థిస్తుండగా ఆయన వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు.వంద రోజుల్లో స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కు తెస్తానని ప్రకటించిన మోడీ ఆ పని చేయలేక, చేయటం చేతకాక సామాన్యుడిపై పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల మార్పిడి నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నలుపు, తెలుపు రంగు దుస్తులతో ఆయన పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోడీని సమర్థిస్తుండగా శివప్రసాద్ వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని మోడీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని అన్నారు. సామాన్యుల నుంచి డబ్బు తీసుకుని నాలుగేళ్లు బ్యాంకుల్లో పెడతాం, వడ్డీ ఇవ్వం అంటున్నారని, ప్రజలకు ఈ ఖర్మ ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా కూడా ఇలాగే ప్రజల బాధలు అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని, ఇప్పుడు మోడీ కూడా అలాగే చేస్తున్నారన్నారు.
మోడీ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, ఇది అవసరమా? అని ప్రశ్నించారు. తమ సొంత డబ్బును తాము తీసుకునేందుకు క్యూలైన్లలో ఎందుకు నిలబడాలని, ఆ పరిస్థితిని మోదీ తమకు ఎందుకు కల్పించారని సామాన్య ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఆదాయపు పన్ను పరిధిని పెంచి సామాన్యుల్ని రక్షించాలని కోరారు.
తాను పార్టీని ధిక్కరించటం లేదని, ఒక కళాకారుడిగా తన భావాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేనని అన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడికి కొన్ని ఆలోచనలు, ఇబ్బందులు ఉండవచ్చునని, తనకు ఇబ్బంది వస్తే మాత్రం ఇంట్లో కూర్చోలేనని, బయటకు వస్తానని చెప్పారు. ముఖ్యమంత్రుల కమిటీకి తమ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహించకపోవటమే మంచిదని, ఈ పాపాన్ని ఆయన కూడా మూటకట్టుకోకపోవటమే ఉత్తమమని అన్నారు.