రోజా బ్రదర్స్ భూకుంభకోణాలు, నీతులా అంటూ ఏకేసిన అనురాధ
వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.
విజయవాడ: వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.భూ కుంభకోణాల గురించి వైసీపీ ఎమ్మెల్యే రోజా జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె కోరారు.హైద్రాబాద్ లో రోజా బ్రదర్స్ చేసిన కుంభకోణం అందరికీ తెలిసిందేనన్నారు.
హైద్రాబాద్ లో తన సోదరులు చేసిన భూ కుంభకోణంలో వారిని కాపాడుకొనేందుకుగాను రోజా వైసీపీ పంచన చేరారని చెప్పారు. ఈ రోజు భూ కుంభకోణాలపై నీతివాఖ్యలు పలకడం గమనించాలని ఆమె ప్రజలను కోరారు. వైఎస్ఆర్ దమ్మున్న మగాడు, మొనగాడంటూ డప్పుకొట్టే ఆమె వైఎస్ హయంలో పుప్పాలగూడ, నాదర్ గుల్, ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన భూ కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు.
భూ కుంభకోణాలపై కాలయాపనకు మాత్రమే సిట్ వేశారని చెప్పడం ఆమె అవగాహనరాహిత్యానికి నిదర్శనమన్నారు. మద్యం మాఫియా విషయంలో సిట్ వేస్తే బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియా మొత్తం బయటపడిందన్నారు.
ఎర్రచందనం విషయంలో స్మగ్లర్లకు చుక్కలు చూపించింది సిట్ కాదా అని ఆమె ప్రశ్నించారు. సిట్ వల్లే గంగిరెడ్డి దేశం వదిలి పారిపోలేదా అని ఆమె గుర్తుచేశారు. విశాఖ భూ కుంభకోణం వ్యవహరం బయటపడగానే...ఇద్దరు తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. మరో 27 మంది తహసీల్దార్లు, 17 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారని చెప్పారు. రెవిన్యూ, పోలీస్, జ్యూడిషియల్ అధికారులతో సిట్ వేసినట్టు అనురాధ చెప్పారు.