ఎమ్మెల్సీగా లోకేష్, కేబినెట్లోకి రంగం సిద్ధం: హరికృష్ణ ఓకే చెప్పారా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి పంపించాలని ఆదివారం నాడు పొలిట్ బ్యూరో సూచించింది.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి పంపించాలని ఆదివారం నాడు పొలిట్ బ్యూరో సూచించింది.
పొలిట్ బ్యూరో భేటీ దాదాపు మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు లోకేష్ పేరును తెరపైకి తీసుకు వచ్చారు. లోకేష్ను ఎమ్మెల్సీగా చేయాలని చంద్రబాబుకు సూచించారు.
చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా
హరికృష్ణ కూడా ఓకే చెప్పారా?
చాన్నాళ్ల తర్వాత నందమూరి హరికృష్ణ పొలిట్ బ్యూరోకు హాజరయ్యారు. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ను వారసుడిగా తెరపైకి తేవడంపై హరికృష్ణ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి హరి.. ఇప్పుడు లోకేష్ను ఎమ్మెల్సీగా తీసుకుందామంటే భేటీలో అంగీకరించారా అనే చర్చ సాగుతోంది.
ఎమ్మెల్సీ.. అనంతరం మంత్రిగా రంగం సిద్ధం!
నారా లోకేశ్ను ఎమ్మెల్సీగా తీసుకోవడంపై చర్చ జరిగిన నేపథ్యంలో... ఆయన మంత్రివర్గంలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లోకేశ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు టిడిపి సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశాన్ని పొలిట్ బ్యూరో చంద్రబాబు చేతిలో పెట్టింది. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. లోకేష్కు ఎమ్మెల్సీ దక్కితే.. ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
మార్చి 2న అసెంబ్లీ ప్రారంభం
మార్చి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారు.