ఎక్కడో తిరుగుతుంటే: కేసీఆర్పై రేవంత్, గూబగుయ్..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దేశంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తర్వాత ఎన్టీఆరే అన్నారు. దేశం స్వేచ్ఛావాయులువు పీల్చేలా చేసింది మహాత్ముడు అయితే, స్వాతంత్రం వచ్చాక అందరికీ సమన్యాయం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం రాశారన్నారు.
అలాంటి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతే, బడుగు బలహీన వర్గాలకు ఉద్ధరించేందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఢిల్లీకి వెళ్తే తెలుగువాడు అంటే ఎన్టీఆరే గుర్తుకు వస్తారని, కాంగ్రెస్ నేతలను ఈ రోజు సోనియా గాంధీ పిలిచి మాట్లాడుతున్నారంటే... ఆ గౌరవం తీసుకోవడానికి కారణం ఎన్టీఆర్ అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వారిలో దాదాపు ఎనభై శాతం మంది సభ్యులు ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. బడుగు, బలహీవర్గాలు పాలకులుగా మారేందుకు కారణం ఎన్టీఆరే అన్నారు. ఈ రోజు తెలంగాణ శాసన సభాపతి కుర్చీలో కూర్చున్న మధుసూదనా చారి నాడు ఎన్టీఆర్ వల్లనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పిలిచి టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన వారు ఎన్టీఆర్ అన్నారు. ఆయన వల్లే ఇప్పుడు సీఎంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జానారెడ్డి ఎక్కడో ఉంటే ఎమ్మెల్యేను చేశారని, అప్పుడు ఆయన వయస్సు 30 ఉంటుందేమోనని, అలాంటి వ్యక్తిని మంత్రిగా చేశారన్నారు.
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన జీవన్ రెడ్డి నాడు ఎక్కడో తిరుగుతుంటే పిలిచి టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేశారన్నారు. ఇప్పుడున్న 119 శాసన సభ్యుల్లో దాదాపు 80 శాతం మంది టీడీపీ నుండి వచ్చిన వారేనని, ఎన్టీఆర్ పెట్టిన భిక్షే అన్నారు. జీవన్ రెడ్డికి, కేసీఆర్కు ఏం పోయేకాలం వచ్చిందో తెలియదు కానీ.. కేంద్రం ఓ మంచి పని చేస్తే, ప్రధాని నరేంద్ర మోడీని, ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి కాదని, అందరి వాడు అన్నారు. తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ నుండి విముక్తి కలిగించారన్నారు. ఎన్టీఆర్ దేశానికి పేరు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఉద్ధరించిన మహానేత అన్నారు. మోత్కుపల్లి విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేశారన్నారు. ఆయన మంత్రి అయ్యాకే పెళ్లి చేసుకున్నారన్నారు.
ఎన్టీఆర్ను అవమానించేలా వ్యవహరించినందుకు.. ఈరోజు మోత్కుపల్లి శాసన సభలో ఉంటే నలుగురికి అన్నా గూబగుయ్ మనేదన్నారు. అలా చేయలేని పరిస్థితిలోనే మోత్కుపల్లి ఈ రోజు దీక్ష చేస్తున్నారన్నారు. తాను కేసీఆర్ గారికి ఓ విషయం చెప్పదల్చుకున్నానంటూ.. రాబోయేది టీడీపీయేనని, రామరాజ్యం తీసుకు వచ్చే బాధ్యత తమదే అన్నారు. రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఉచిత కరెంట్.. ఇలా ఏం చెప్పినా ఎన్టీయారే గుర్తుకు వస్తారన్నారు. టీడీపీని అధికారంలోకి తెస్తామన్నారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో శాసన సభ గురించి మాట్లాడదల్చుకోలేదన్నారు.