బాబు ఎలా ఫెయిలయ్యారో చూడండి, అప్పుడే డౌట్: రఘువీరా
హైదరాబాద్: ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎలా ఫెయిల్ అయ్యారో చూడాలంటూ ఆయన ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటనలను, చంద్రబాబు హామీలను ప్రదర్శించారు.
ఏపీ కాంగ్రెస్ నేతలు ఈసీని కలిశారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందున టీడీపీ గుర్తింపు రద్దు చేయాలన్నారు. విభజన అనంతరం 2014 మార్చి నెలాఖరున టీడీపీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు.
ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చిందని చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీన హామీల విషయమై ఈసీ నోటీసులు జారీ చేసిందని, వాటిని అమలు చేస్తారా అని ప్రశ్నించిందని చెప్పారు. హామీల బాధ్యత తమదేనని రెండు రోజుల అనంతరం టీడీపీ లేఖ పంపించిందన్నారు.
అయితే, ఇప్పుడు హామీలు నెరవేర్చడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్ సైట్ నుండి ఎలక్షన్ మేనిఫెస్టోను తొలగించారని, అప్పుడే తమకు అనుమానం వచ్చిందని చెప్పారు. వెబ్ సైట్ నుండి వాటిని ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు.
టీడీపీ ఇచ్చిన హామీలలో కొన్ని పాక్షికంగా అమలు చేశారని, చాలా వాటిని కనీసం ముట్టుకోలేదన్నారు. వాటిని అమలు చేయకుంటే టీడీపీ పైన క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. ప్రజలకు ఇంకా సిస్టం పైన నమ్మకం ఉందన్నారు. దానిని ప్రజలు కోల్పోకుండా చూడాలన్నారు. హామీల పైన రివర్స్ గేర్ సరికాదన్నారు.